చెట్లు నరికినందుకు..లక్ష రూపాయల ఫైన్

చెట్లు నరికినందుకు..లక్ష రూపాయల ఫైన్

సిద్దిపేట పట్టణంలో అనుమతులు లేకుండా చెట్లు నరికినందుకు మున్సిపల్ అధికారులు కఠిన చర్యలు తీసుకున్నారు. పట్టణంలోని హోసింగ్ బోర్డు ప్రాంతంలో ఐదు చెట్లు నరికినందుకుగాను బాధ్యులపై భారీ జరిమానా విధించారు. ఒక్కో చెట్టుకు రూ. 20వేల చొప్పున మొత్తం లక్ష రూపాయల జరిమానా వేస్తూ మున్సిపల్ కమిషనర్ అశ్రీత్ కుమార్ ఆదేశాలు జారీ చేశారు.

చట్టపరమైన చర్యలు

జరిమానా విధించడంతో పాటు ఈ ఘటనపై 1 టౌన్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు కూడా చేశారు కమిషనర్ అశ్రీత్ కుమార్. ఇకపై ఎవరైనా అనుమతులు లేకుండా చెట్లు నరికితే చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

పర్యావరణ పరిరక్షణలో భాగంగా చెట్లను కాపాడాల్సిన అవసరాన్ని ఈ చర్య నొక్కి చెబుతోంది. సిద్దిపేటలో చెట్లు నరికే వారికి ఇది ఓ హెచ్చరికగా నిలుస్తుంది.