- ముస్లిం మహిళను ఠాణాకు తరలించడంపై ఎమ్మెల్యే, సీపీఐ నాయకుల ఆగ్రహం
- పోలీస్స్టేషన్లో ఖాళీ బ్యాలెట్బాక్స్ ఉండటంతో బైఠాయించి ఆందోళన
భద్రాద్రికొత్తగూడెం/పాల్వంచ, వెలుగు: పాల్వంచ పోలీస్స్టేషన్ లో బుధవారం రాత్రి హైటెన్షన్ నెలకొంది. పోలింగ్బూత్నంబర్45లో దొంగ ఓటు వేశారంటూ అన్యాయంగా ఓ ముస్లిం మహిళను ఠాణాలో నిర్బంధించారని కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు, సీపీఐ జిల్లా కార్యదర్శి ఎస్కే.సాబీర్పాషా ఆరోపించారు. ఠాణాలో ఖాళీ బ్యాలెట్ బాక్స్ కనిపించడంతో నాయకులు, కార్యకర్తలతో కలిసి ఆందోళన చేపట్టారు. పోలీసుల తీరుపై మండిపడ్డారు. ముస్లిం మహిళను పోలీస్స్టేషన్కు తీసుకెళ్లడంపై తాను సీఐకి ఫోన్చేస్తే దురుసుగా మాట్లాడారని సాబీర్ పాషా అన్నారు. సీఐ క్షమాపణ చెప్పాలని డిమాండ్చేశారు. ఠాణాలో ఉన్న ఖాళీ బ్యాలెట్బాక్స్ను పోలింగ్ ఆఫీసర్లు తీసుకెళ్తుండగా.. పోలీసులే దొంగ ఓట్లు వేయిస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఖాళీ బ్యాలెట్ బాక్స్ ఇక్కడికి ఎలా వచ్చిందని ఎమ్మెల్యే ప్రశ్నించారు.
రామవరంలో కాంగ్రెస్, సీపీఐ నేతల తోపులాట
భద్రాద్రికొత్తగూడెం, వెలుగు: కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్లోని రామవరంలో కాంగ్రెస్, సీపీఐ నాయకుల మధ్య వాగ్వాదం, తోపులాట జరిగింది. పోలీసులు వచ్చి ఇరువర్గాలను చెదరగొట్టారు. డీఎస్పీ ఆదినారాయణ బందోబస్తును పర్యవేక్షించారు.
