ఆ పై పేదలకు అమ్మి వారిని నిండా ముంచుతున్నరు
ఇందుకు మజ్లిస్ సహకరిస్తున్నదని ఆరోపణ
హైదరాబాద్, వెలుగు: కొందరు ఆక్రమణదారులు మూసీ భూములను కబ్జా చేసి పేదలకు అమ్ముతున్నారని కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి ఆరోపించారు. ఆ భూములు కొనుగోలు చేసిన పేదలు మోసపోతున్నారన్నారు. రిజిస్ట్రేషన్, జీపీఏ పేరుతో మోసం చేస్తున్నారని చెప్పారు. హైదరాబాద్ సిటీలో ఏడెనిమిదేండ్లుగా ఎక్కడ చూసినా అధికార దుర్వినియోగానికి పాల్పడి భూములను కబ్జా చేస్తున్నారని విమర్శించారు. హైదరాబాద్కు అందమే మూసీ నది అని, కానీ, కబ్జాదారులు, దళారీలు, రాజకీయ నాయకులు పోలీసుల సాయంతో కుమ్మక్కై మూసీ నదిని ఆక్రమించేస్తున్నారని ఆరోపించారు. ప్రభుత్వం వెంటనే ప్రత్యేక అధికారులతో ఎంక్వైరీ చేసి కబ్జాదారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
బుధవారం హైదరాబాద్లోని అంబర్పేట, బాగ్ అంబర్పేట డివిజన్లలో పవర్ బోర్లను ఆయన ప్రారంభించారు. భారత్నగర్లో కమ్యూనిటీ హాల్కు శంకుస్థాపన చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. రూ.3500 కోట్లతో రివర్డెవలప్మెంట్ కార్పొరేషన్ను ఏర్పాటు చేసి మూసీని ప్రక్షాళన చేస్తామని మాజీ సీఎం కేసీఆర్ చెప్పారని, కానీ, ఒక్క అడుగూ ముందుకు పడలేదని విమర్శించారు. ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డి.. అధికారులను, ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీని లండన్ తీసుకెళ్లి థేమ్స్ నదిలాగా మూసీని అభివృద్ధి చేస్తామంటున్నారని, కానీ, మూసీ భూముల ఆక్రమణకు సహకరించిందే మజ్లిస్ పార్టీ అన్న విషయాన్ని రేవంత్ మర్చిపోయారని పేర్కొన్నారు. కొన్నేండ్ల క్రితం హైదరాబాద్కు వరదలు వచ్చినప్పుడు 111 జీవో ఎత్తేస్తామంటూ గత ప్రభుత్వం చెప్పిందని, ఆ పేరు మీద బీఆర్ఎస్ నాయకులు వేలాది ఎకరాలను సంపాదించారని ఆరోపించారు. కాబట్టి హైదరాబాద్ను భవిష్యత్లో సురక్షితంగా ఉంచాలంటే 111 జీవో రద్దుపై ప్రభుత్వం పునరాలోచించాలని సూచించారు.