నైపిడా: తూర్పు మయన్మార్లోని ఓ మారుమూల గ్రామంలో ఆదివారం ఘోర ప్రమాదం సంభవించింది. మైనింగ్ కోసం ఉపయోగించే శక్తిమంతమైన పేలుడు పదార్థాలు దాచిన బిల్డింగ్ లో భారీ బ్లాస్ట్ చోటుచేసుకుంది. దీంతో 45 మంది చనిపోగా.. మరో 70 మందికి పైగా గాయపడ్డారు. ప్రమాద తీవ్రత చాలా ఎక్కువగా ఉందని, మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు.
న్యామ్ కామ్ టౌన్ షిప్ పరిధిలోని కౌంగ్ టప్ గ్రామంలో ఆదివారం పేలుడు సంభవించి భారీగా మంటలు ఎగిసిపడ్డాయి. విషయం తెలుసుకున్న రెస్క్యూ బృందాలు ఘటనాస్థలానికి చేరుకొని గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించారు. మృతదేహాలను వెలికి తీసి బంధువులకు అప్పగించామని చెప్పారు. మరికొంతమంది శిథిలాల కింద ఉండొచ్చని అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
