వాషింగ్టన్: అమెరికా ఉటా రాష్ట్రంలోని ఓ ప్రముఖ షాపింగ్ మాల్లో దారుణం జరిగింది. స్టాల్లో పనిచేస్తున్న సోహైల్ అనే భారతీయ ముస్లిం యువకుడిపై పీటర్ మైఖేల్ లార్సెన్(48) అనే వ్యక్తి కత్తితో దాడి చేశాడు. ఈ ఘోర దాడిలో సోహైల్ శరీరంపై దాదాపు 15 కత్తిపోట్లు పడ్డాయి. నిందితుడు లార్సెన్ మొదట బాధితుడి వద్దకు వెళ్లి మాటలు కలిపి, ఎక్కడి నుంచి వచ్చావని ప్రశ్నించాడు. తాను భారతదేశానికి చెందిన వ్యక్తినని, తన పేరు సోహైల్ అని బాధితుడు సమాధానమిచ్చాడు.
వెంటనే నిందితుడు ‘నువ్వు ముస్లింవా?’ అని అడగ్గా.. సోహైల్ ‘అవును’ అని చెప్పాడు. ఆ వెంటనే నిందితుడు లార్సెన్ తన వద్ద ఉన్న కత్తిని తీసి సోహైల్పై విచక్షణారహితంగా దాడి చేశాడు. మతం కారణంగానే తాను దాడి చేశానని, ముస్లింలను చంపడమే తన ఉద్దేశమని నిందితుడు వెల్లడించాడు. ఈ ఉదంతాన్ని హేట్ క్రైమ్గా పరిగణించిన పోలీసులు.. నిందితుడిపై హత్యాయత్నం కేసు నమోదు చేసి జైలుకు తరలించారు.
ప్రస్తుతం తీవ్రంగా గాయపడిన సోహైల్కు ఆసుపత్రిలో పలు శస్త్రచికిత్సలు జరిగాయి. ప్రస్తుతం అతడి ఆరోగ్య పరిస్థితి విషమంగానే ఉన్నట్లు సమాచారం. కాగా, అమెరికాలో ముస్లిం వ్యతిరేక, రేసిస్ట్ దాడులు పెరుగుతుండటంపై అక్కడి హక్కుల సంఘాలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.
