Srimanthudu Copyright Case: శ్రీమంతుడు కాపీరైట్ కేసు..స్పందించిన మైత్రీ మూవీ మేకర్స్

Srimanthudu Copyright Case: శ్రీమంతుడు కాపీరైట్ కేసు..స్పందించిన మైత్రీ మూవీ మేకర్స్

శ్రీమంతుడు(Srimanthudu) సినిమాకు సంబంధించి కాపీ రైట్‌‌ యాక్ట్ కింద మొదలైన వివాదం డైరెక్టర్ కొరటాల శివ చాలా రోజుల నుంచి ఎదుర్కొంటున్నారు. చచ్చేంత ప్రేమ పేరిట తాను రాసిన నవలలో స్వల్ప మార్పులు చేసి శ్రీమంతుడు పేరిట సినిమా తీశారంటూ ఆ మూవీ డైరెక్టర్‌‌‌‌ కొరటాల శివ, నిర్మాతలు ఎర్నేని రవి, ఎంబీ ఎంటర్‌‌‌‌టైన్‌‌మెంట్లపై రచయిత శరత్‌‌ చంద్ర క్రిమినల్‌‌ కేసు పెట్టారు.

ఇదే విషయంపై డైరెక్టర్ కొరటాల శివ(Koratala Siva) సుప్రీంకోర్టును ఆశ్రయిస్తే ఆ విషయంలో తామేమీ చేయలేము అని కింద కోర్ట్ ఏం చెబితే అది కచ్చితంగా ఫాలో అవ్వాల్సిందే అని ఇటీవల సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది.ఈ నేపథ్యంలో కేసు వేసిన రైటర్ శరత్ చంద్ర రీసెంట్ గా పలు చానల్స్కి వరుస ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. దీంతో అనేక రకాలైన వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. 

ఇప్పుడు ఈ వివాదం మీద శ్రీమంతుడు నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్(Mythri Movie Makers) అధికారికంగా స్పందించింది. శ్రీమంతుడు స్టోరీ కాపీ వివాదం మీద ఇప్పుడేం స్పందించలేమని, ప్రస్తుతం ఈ సినిమా వ్యవహారం కోర్టులో కేసు నడుస్తోందని..ఈ రోజు వరకు ఎటువంటి విచారణలు, తీర్పులు రాలేదు. అందువల్ల అప్పుడే ఒక అభిప్రాయానికి రావొద్దని మీడియాకు విజ్ఞప్తి చేస్తున్నాం.

శ్రీమంతుడు కథపై సదరు రచయిత చేస్తున్న ఆరోపణలు అన్నీ నిరాధారమైనవి. ఆ విషయంపై కోర్టు గాని, రచయితల సంఘము గాని ఎటువంటి తీర్పు ఇవ్వలేదనే  వాస్తవం అందరు గ్రహించాలి. అలాగే శ్రీమంతుడు మూవీ, చచ్చేంత ప్రేమ నవల రెండు పబ్లిక్ డొమైన్లో వున్నాయి. రెండు వేటికవే భిన్నమైనవి. పుస్తకం, ఫిల్మ్ను పరిశీలించే వారు..వీలైతే వాటిని చూసి వాస్తవాన్ని తెలుసుకోవాలని కోరుకుంటున్నాం.  

'శ్రీమంతుడు' ముఖ్య ఉద్దేశం..గ్రామాన్ని దత్తత తీసుకోవాలనేది మా ప్రధాన ఆలోచన. కోర్టు నుండి తీర్పు రాకుండా మేం ఎలాంటి కామెంట్లు చేయమని, అది చట్ట విరుద్దమని, తమకు న్యాయం, చట్టాల మీద నమ్మకం ఉందని మైత్రీ సంస్థ చెప్పుకొచ్చింది. అయితే, కోర్టు  పరిధిలో వున్న ఈ అంశంపై అసత్య ప్రచారాలు చేస్తున్న ఎవరిమీదైనా సరే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలియజేస్తున్నాం. దయచేసి ఆధారం లేని ఆరోపణలని సోషల్ మీడియాలో ప్రచారం చేయొద్దని మీడియా వారిని కోరుతున్నాము. అంటూ మైత్రి టీమ్ నోట్ రిలీజ్ చేసింది. త్వరలో ఈ అంశంపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. 

ఏదేమైనప్పటికీ..తెలుగు స్టార్ డైరెక్టర్ల మీద ఇలా కాపీ మరకలు కొత్తేమీ కాదు. కొరటాల శివ, త్రివిక్రమ్ శ్రీనివాస్ వంటి వారి మీద ఇలాంటి వివాదాలు తరుచూ వస్తూనే ఉంటాయి. త్రివిక్రమ్ గత సినిమాలు ఏదో ఒక నవలల్లోంచి కాపీ కొట్టడం, ఆ తరువాత సెటిల్మెంట్ చేసుకోవడం వంటి అంశాలు వస్తూనే ఉన్నాయి.