- ప్రజా తీర్పును శిరసావహిస్తం: ఎన్.రాంచంద ర్రావు
హైదరాబాద్, వెలుగు: జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో తమ పార్టీకి ఎప్పుడూ మెజారిటీ రాలేదని, అయినా ప్రజా తీర్పును శిరసావహిస్తామని బీజేపీ స్టేట్ చీఫ్ ఎన్.రాంచందర్ రావు అన్నారు. ఈ విజయం కాంగ్రెస్ పార్టీది కానేకాదని, ఎంఐఎం గెలుపుగా భావించాల్సి ఉందన్నారు. గతంలో మజ్లిస్ అభ్యర్థిగా పోటీ చేసిన నవీన్ యాదవ్.. ఈసారి కాంగ్రెస్ తరఫున గెలిచారని గుర్తుచేశారు. అధికార దుర్వినియోగం, డబ్బు, మందును వాడుకొని కాంగ్రెస్ ఈ ఎన్నికల్లో గెలిచిందని ఆరోపించారు. సిట్టింగ్ స్థానం కోల్పోయిన తర్వాత కూడా రాష్ట్రంలో తమదే ప్రత్యామ్నాయమని బీఆర్ఎస్ చెప్పడం ఆశ్చర్యంగా ఉందన్నారు.
శుక్రవారం పార్టీ స్టేట్ ఆఫీసులో మీడియాతో ఆయన మాట్లాడుతూ.. బిహార్ ప్రజలు బీజేపీ ఆధ్వర్యంలోని ఎన్డీయే కూటమికి 200కు పైగా సీట్లను కట్టబెట్టి, కాంగ్రెస్ను ఒక్క సీటుకే పరిమితం చేశారన్నారు. అక్కడ అభివృద్ధికే పట్టం కట్టారని, డబుల్ ఇంజిన్ సర్కార్ వల్లే అభివృద్ధి సాధ్యమని నమ్మి, ఎన్డీయేకు ఓటేశారన్నారు. బీజేపీ కూడా తాత్కాలిక పరాజయానికి నిరాశ పడదని చెప్పారు. డిసెంబర్ 7న ‘ప్రజా పాలన దినోత్సవం’పేరుతో కాంగ్రెస్ సంబురాలు చేసుకోనుండగా, అదే రోజున ‘కాంగ్రెస్ ప్రజా వంచన దినం’పేరుతో బీజేపీ పోరాటాలకు ప్లాన్ చేస్తున్నట్టు తెలిపారు.
బ్లాక్ మెయిల్తో గెలిచింది: బీజేఎల్పీ నేత ఏలేటి
అవినీతి, అధికార దుర్వినియోగంతో జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ పార్టీ గెలిచిందని బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి ఆరోపించారు. జూబ్లీహిల్స్లో కాంగ్రెస్ గెలిచింది బ్లాక్ మెయిల్ చేయడం వల్లేనన్నారు. పథకాలు బంద్ చేస్తామని సీఎం బెదిరించడంతోనే గెలిచారని తెలిపారు. కాంగ్రెస్కు ఎంఐఎం పెద్దన్న పాత్ర పోషించిందని, వారి మద్దతు ఉండటంతో విజయం సాధించారన్నారు.
