నాగర్ కర్నూల్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే మర్రి జనార్ధన్ రెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ నేతలకు వార్నింగ్ ఇచ్చారు. తనతో పెట్టుకుంటే మీకే మైనస్ అంటూ హెచ్చరించారు. తనను గెల్కొద్దని.. తనకు పిచ్చి లేస్తే కాంగ్రెసోళ్లను కాల్చి పడేస్తానని వ్యాఖ్యానించారు.తన క్యాడర్ తల్చుకుంటే ఒక్కరు కూడా గ్రామాల్లో తిరగలేరనన్నారు. కాంగ్రెస్ నేతల తాటాకు చప్పుళ్లకు భయపడేది లేదన్నారు.
నాగర్ కర్నూల్ నియోజకవర్గంలోని తెల్కపల్లి మండలంలో మర్రి జనార్ధన్ రెడ్డి ఈ వ్యాఖ్యలు చేశారు. నాగర్ కర్నూలు బీఆర్ఎస్ టికెట్ మళ్లీ ఆయనకే ఇవ్వడంతో ఎన్నికల ప్రచారం మొదలు పెట్టారు. నియోజకవర్గంలో పాదయాత్ర చేస్తుండగా తెల్కపల్లిలో కొందరు కాంగ్రెస్ కార్యకర్తలు ఆయనకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో ఆగ్రహంతో రెచ్చిపోయిన మర్రి జనార్ధన్ రెడ్డి కాంగ్రెస్ కార్యకర్తలకు వార్నింగ్ ఇచ్చారు.