నాగార్జున రియల్ హీరో.. కబ్జా చేసిన రెండు ఎకరాలను తిరిగి ఇచ్చేశారు: సీఎం రేవంత్

నాగార్జున రియల్ హీరో.. కబ్జా చేసిన రెండు ఎకరాలను తిరిగి ఇచ్చేశారు: సీఎం రేవంత్

మాదాపూర్ లో ఎన్ కన్వెన్షన్ కబ్జా చేసిన భూమిని నాగార్జున తిరిగి ఇచ్చేశారని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.  ఎన్ కన్వెన్షన్ కబ్జాను నాగార్జున అంగీకరించారని చెప్పారు. కబ్జా చేసిన 2 ఎకరాల భూమిని ఆయనే ప్రభుత్వానికి  అప్పగించి నిజమైన హీరో అనిపించుకున్నారని కొనియాడారు. గచ్చిబౌలి ఫ్లై ఓవర్ ప్రారంభోత్సవంలో మాట్లాడుతూ నాగార్జున ప్రభుత్వానికి భూమి అప్పగించి రియల్ హీరో అనిపించుకున్నారని ఈ సందర్భంగా సీఎం రేవంత్ అన్నారు.

సినీ నటుడు అక్కినేని నాగార్జునకు చెందిన ఎన్‌ కన్వెన్షన్‌ను గతంలో హైడ్రా బృందం కూల్చివేసిన విషయం తెలిసిందే. మాదాపూర్‌లోని తుమ్మిడి చెరువు ఎఫ్టీఎల్ లో నిర్మించిన భాగాన్ని భారీ బందోబస్తు మధ్య అధికారులు కూల్చివేశారు. మూడెకరాల 30 గుంటల చెరువు ఎఫ్టీఎల్ స్థలాన్ని కబ్జా చేసినట్టు ఫిర్యాదులు రావడంతో హైడ్రా 2024, ఆగస్టు 24న ఉదయం కూల్చివేతలు చేపట్టింది. 

వివాదం ఇదే?

హీరో నాగార్జున, నల్ల ప్రీతమ్ రెడ్డితో కలిసి మాదాపూర్‌లో ఎన్3 ఎంటర్ ప్రైజెస్ పేరుతో ఎన్ కన్వెన్షన్‌‌ను 2015లో నిర్మించారు. మొత్తం 10 ఎకరాల్లో ఎన్ కన్వెన్షన్ ఉంది. ఇందులో 1.30 ఎకరాలు ఎఫ్‌టీఎల్ పరిధిలో ఉన్నాయి. 2 ఎకరాలు బఫర్ జోన్‌ను ఆక్రమించి నిర్మాణాలు చేపట్టారు. ఇదే అంశంపై ప్రభుత్వానికి ఫిర్యాదులు వచ్చాయి. దాంతో హైడ్రా అధికారులు చర్యలు తీసుకున్నారు.  

దీనిపై సీఎం రేవంత్ మాట్లాడుతూ.. ఎన్ కన్వెన్షన్ సెంటర్ చెరువు ఎఫ్టీఎల్ భూమిని కబ్జా చేసిందని హైడ్రా కూల్చి వేసిన తర్వాత.. నటుడు అక్కినేని నాగార్జునే స్వయంగా రెండు ఎకరాల భూమిని ప్రభుత్వానికి తిరిగి ఇచ్చేశారని సీఎం తెలిపారు. ఆక్రమణను అంగీకరించి భూమిని తిరిగిచ్చి ఆయన నిజమైన హీరో అనిపించుకున్నారని సీఎం రేవంత్ కొనియాడారు. 

హైదరాబాద్ లో అనేక చెరువులు, నాళాలు కబ్జాకు గురయ్యాయని అన్నారు. హైడ్రాతో కబ్జాలకు ఉక్కపాదం మోపుతున్నామని తెలిపారు. 2029లో నియోజకవర్గాల పునర్విభజన జరుగుతుందని... శేర్లింగంపల్లి 4 నియోజకవర్గాలుగా మారబోతుందని ఈ సందర్భంగా సీఎం తెలిపారు.

కంచె గచ్చిబౌలి భూముల విషయంలో తప్పుడు ప్రచారం చేశారని సీఎం రేవంత్ అన్నారు. తమ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని చూసి.. పెట్టుబడులను అడ్డుకోవాలని బీఆర్ఎస్ కుట్ర చేస్తోందని మండిపడ్డారు. హైదరాబాద్ నగరానికి కాలుష్యమే ఇపుడు యమపాశం అయ్యిందని ఆవేదన వ్యక్తం చేశారు.   

ఫ్యూచర్ సిటీని గొప్పగా నిర్మిస్తామని.. నెట్ జీరో సిటీని నిర్మించాలనేదే మా ప్రయత్నమని అన్నారు. తనకు నగర అభివృద్ధిపై సంపూర్ణ అవగాహన ఉందని.. నగరంతో నాకు 40 ఏళ్ల అనుభందం ఉందని చెప్పారు.   రాజకీయ ముసుగులో అభివృద్ధిన అడ్డుకునే వారిని క్షమించాలా? అని ఈ సందర్భంగా ప్రశ్నించారు.