
నల్లగొండ: నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు వదర పోటెత్తింది. ఎగువన కురుస్తున్న వర్షాలకు డ్యాంలోకి భారీగా వరద నీరు వచ్చిచేరుతోంది. దీంతో ప్రాజెక్టు నిండుకుండలా కనిపిస్తోంది. ప్రాజెక్టుకు జలకళ సంతరించుకుంది. 26 క్రస్ట్ గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. ఈ క్రమంలో సాగర్ అందాలను తిలకించేందుకు పర్యాటకులు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు.
బుధవారం (జూలై30) సాయంత్రానికి నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు 2లక్షల 82వేల 364 క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతోంది. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 590 అడుగులు కాగా.. ప్రస్తుత నీటిమట్టం 586 అడుగులుగా ఉంది. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం 312.0450 టీఎంసీలు కాగా.. ప్రస్తుతం ప్రాజెక్టు నీటి నిల్వ 300.3200.టీఎంసీలుగా ఉంది.
నాగార్జున సాగర్ ప్రాజెక్టుమొత్తం 26 క్రస్ట్ గేట్లు ఎత్తి నీటిని దిగువకు వదులుతున్నారు. ఇందులో 16 గేట్లు 5ఫీట్ల మేర, 10 గేట్లు 10ఫీట్ల మేర ఎత్తి 2లక్షల 65వేల 08 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు అధికారు. ఇక ప్రాజెక్టు ప్రధాన జలవిద్యుత్తు కేంద్రంలో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతోంది.