బీజేపీలోకి నాగర్​కర్నూల్​ ఎంపీ

బీజేపీలోకి నాగర్​కర్నూల్​ ఎంపీ
  • అమిత్​షా సమక్షంలో నేడు పార్టీలోకి రాములు
  • ఆయన వెంట మరో ముగ్గురు ముఖ్య నేతలు 
  • పార్లమెంట్ ఎన్ని కల ముందు బీఆర్ఎస్​కు షాక్​

నాగర్ కర్నూల్, వెలుగు: పార్లమెంట్​ఎన్నికల ముందు బీఆర్ఎస్​కు మరో షాక్​ తగిలింది. ఇప్పటికే ఆ పార్టీకి చెందిన పెద్దపల్లి ఎంపీ వెంకటేశ్​ నేత కారు దిగి కాంగ్రెస్​లో చేరగా, తాజాగా నాగర్​కర్నూల్​ఎంపీ పోతుగంటి రాములు గురువారం బీజేపీలో చేరబోతున్నారు. ఆయన కొడుకు కల్వకుర్తి జడ్పీటీసీ భరత్ ప్రసాద్, వనపర్తి జడ్పీ చైర్మన్ లోక్ నాథ్ రెడ్డి, డీసీసీబీ డైరెక్టర్ జక్కా రఘునందన్ రెడ్డితో కలిసి గురువారం అమిత్​షా సమక్షంలో బీజేపీలో చేరేందుకు బుధవారం రాత్రే ఢిల్లీ బయల్దేరి వెళ్లారు. నాలుగు సార్లు ఎమ్మెల్యేగా, ఉమ్మడి ఏపీలో మంత్రిగా పనిచేసిన రాములు తనకు బీఆర్ఎస్​లో కనీస గౌరవం లేకుండా పోయిందని కొంతకాలంగా సన్నిహితుల దగ్గర వాపోతున్నారు. 

అచ్చంపేట మాజీ ఎమ్మెల్యే, పార్టీ జిల్లా అధ్యక్షుడు గువ్వల బాలరాజుకు, ఎంపీ పోతుగంటి రాములుకు మధ్య విభేదాలు తీవ్రస్థాయికి చేరాయి. ఎంపీ కొడుకు భరత్​ ప్రసాద్​ను జడ్పీ చైర్మన్​ కాకుండా గువ్వల రెండుసార్లు అడ్డుకున్నారనే ఆరోపణలు వచ్చాయి. నియోజకవర్గంలో ఎంపీ, ఆయన కొడుకు ఫ్లెక్సీలను కూడా పెట్టకుండా అడ్డుకున్న గువ్వలపై హైకమాండ్​ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో రాములు కలత చెందినట్టు సమాచారం. 

ఎన్నికల ముందు అచ్చంపేటలో జరిగిన కేసీఆర్​ బహిరంగ సభకు కూడా ఎంపీని  ఆహ్వానించలేదు. దీనికితోడు అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత గువ్వల.. తానే ఎంపీ  అభ్యర్థినంటూ ప్రచారం చేసుకోవడం కూడా వీరి మధ్య గ్యాప్​ను పెంచింది. మరోవైపు తన కొడుకు భరత్​ప్రసాద్​ రాజకీయ భవిష్యత్​ను దృష్టిలో పెట్టుకుని బీజేపీలో చేరుతున్నట్లు తెలుస్తోంది.  వీరితోపాటు వనపర్తి జడ్పీ చైర్మన్ లోక్ నాథ్ రెడ్డి, డీసీసీబీ డైరెక్టర్ జక్కా రఘునందన్ రెడ్డి కూడా బీజేపీలో చేరుతున్నారు.