నేరాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవు : ఎస్పీ శరత్ చంద్ర పవార్

నేరాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవు :  ఎస్పీ శరత్ చంద్ర పవార్
  •     తరచూ దొంగతనాలకు పాల్పడుతున్న వారిపై కఠిన చర్యలు 
  •     ఎస్పీ శరత్ చంద్ర పవార్

నల్గొండ, వెలుగు: తరచూ దొంగతనాలు, చైన్ స్నాచింగ్, బైక్‌, ఇళ్లలో చోరీల లాంటి నేరాలకు పాల్పడుతున్న వారిపై జిల్లా పోలీస్ శాఖ కఠినంగా వ్యవహరించనున్నట్లు ఎస్పీ శరత్ చంద్ర పవార్ హెచ్చరించారు. నల్గొండ  జిల్లాలో గతంలో దొంగతనాలకు పాల్పడిన వ్యక్తులందరినీ పోలీస్ శిక్షణ  కేంద్రంలో కౌన్సెలింగ్ నిర్వహించి, నేరాలకు దూరంగా ఉండి సత్ప్రవర్తనతో  జీవించాలని సూచనలు ఇచ్చారు. 

ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ..   జిల్లాలో నేరాలకు అలవాటుపడిన వ్యక్తుల కదలికలపై పోలీస్ శాఖ ఇప్పటికే ప్రత్యేక నిఘా బృందాలు, నైట్ పెట్రోలింగ్ టీంలు,  సీసీటీవీ నిఘా వ్యవస్థల ద్వారా నిరంతర పర్యవేక్షణ కొనసాగిస్తున్నట్లు తెలిపారు. 

ముఖ్యంగా తరచూ నేరాలకు పాల్పడుతున్న వ్యక్తులు, అనుమానితులపై ప్రత్యేక దృష్టి సారించినట్లు వెల్లడించారు. నిందితులు తమ ప్రవర్తనను వెంటనే మార్చుకోకపోతే, పీడీయాక్ట్, రౌడీషీట్‌, బైండోవర్ కేసులు, కఠిన చట్టాల కింద అరెస్టులు తప్పవని ఎస్పీ హెచ్చరించారు.  ప్రజలు తమ ఏరియాల్లో  సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలన్నారు.  పొరుగువారితో సమన్వయం చేసుకుంటూ ఉండాలన్నారు.  అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే డయల్ 100  లేదా సమీప పోలీస్ స్టేషన్‌కు వెంటనే సమాచారం అందించాలని కోరారు.  

జిల్లాలో శాంతి భద్రతలను పరిరక్షించడమే పోలీస్ శాఖ ప్రధాన లక్ష్యమని, నేరాలపై జీరో టాలరెన్స్ విధానంతో పని చేస్తున్నామని తెలిపారు.  దొంగతనాలకు పాల్పడుతున్న వారు సత్ప్రవర్తనతో నేరాలను మానుకొని ఉపాధి మార్గాల వైపు అడుగులు వేయాలన్నారు.  అలాంటి వారికి పోలీస్ శాఖ తరఫున అవసరమైన సహాయ- సహకారాలు అందించేందుకు సిద్ధంగా ఉన్నామని ఎస్పీ స్పష్టం చేశారు.