పూర్వ విద్యార్థులు ఓయూ ఖ్యాతిని పెంచాలి : ఇంద్రసేనారెడ్డి

పూర్వ విద్యార్థులు ఓయూ ఖ్యాతిని పెంచాలి : ఇంద్రసేనారెడ్డి

ఓయూ,వెలుగు : రాజకీయాలకు అతీతంగా పూర్వ విద్యార్థులు ఓయూ అభివృద్ధికి కృషి చేయాలని త్రిపుర గవర్నర్ నల్లు ఇంద్రసేనారెడ్డి పిలుపునిచ్చారు. వర్సిటీ మాజీ స్టూడెంట్ గా  గర్వించేలా బాధ్యతలను నిర్వర్తిస్తానని చెప్పారు. ఉస్మానియా ఫౌండేషన్, పూర్వ విద్యార్థుల సంఘం తరఫున గవర్నర్ ఇంద్రసేనారెడ్డిని ఘనంగా సత్కరించారు. ఉస్మానియా ఫౌండేషన్, పూర్వ విద్యార్థుల సంఘం ద్వారా ఉన్నత శిఖరాలు అధిరోహించిన వారిని గౌరవించుకోవాలని సూచించారు.

తద్వారా ఓయూకు మరింత ఖ్యాతి పెరుగుతుందని వివరించారు. ఉస్మానియన్లు త్రిపురను సందర్శించి తన ఆతిథ్యాన్ని స్వీకరించాలని కోరారు.  ఇటీవల ఓయూలో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను ప్రశంసించారు. ఓయూలో రెండున్నరేండ్లలో చేపట్టిన అభివృద్ధిని వీసీ రవీందర్ యాదవ్ వివరించారు. రిజిస్ట్రార్  లక్ష్మినారాయణ, పూర్వ విద్యార్థుల సంఘం ప్రతినిధులు శ్యాంమోహన్, విజయ్, ప్రొ. రమేష్ రెడ్డి, ఉస్మానియా ఫౌండేషన్, పూర్వ విద్యార్థుల సంఘం ప్రతినిధులు, పూర్వ విద్యార్థులు, అధ్యాపకులు పాల్గొన్నారు.