ఏపీలో రాజకీయ దుమారం రేపిన లిక్కర్ స్కాం కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది.ఈ కేసులో భాగంగా మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు కొడుకు కారుమూరి సునీల్ ను ఈడీ అధికారులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. సునీల్ ను నాంపల్లి కోర్టులో హాజరు పరచగా... ఆయనకు జూన్ 25 వరకు రిమాండ్ విధించింది కోర్టు. అనంతరం సునీల్ ను చంచల్ గూడా జైలుకు తరలించారు అధికారులు.
గురువారం ( జూన్ 18 ) హైదరాబాద్ లో సునీల్ ను అరెస్ట్ చేసిన అధికారులు విచారణ కోసం ఈడీ ఆఫీసుకు తరలించారు.ఏపీ స్టేట్ బివరేజెస్ కార్పొరేషన్ లిమిటెడ్ మద్యం రవాణా టెండర్లలో భారీ అవకతవకలు జరిగాయని.. దీని వల్ల ప్రభుత్వ ఖజానాకు భారీ నష్టం వాటిల్లిందని ఆరోపిస్తోంది ఈడీ.
సిగ్మా సప్లై చైన్ సొల్యూషన్స్ వంటి సంస్థలకు అనుకూలంగా టెండర్ నిబంధనలను విరుద్ధంగా మార్చి ప్రభుత్వ ఆదాయానికి రూ.195 కోట్ల మేర ఆదాయానికి గండికొట్టారని అంచనా వేస్తున్నారు ఈడీ అధికారులు.
