బాస్ చాలా ముఖ్యమైన ప్రాజెక్ట్ అప్పజెప్పాడు.. ఇన్ టైమ్లో అది కంప్లీట్ చేసి అప్పజెప్పాలి. ఆ పనిలో బిజీగా ఉన్న రమేష్కి బలవంతంగా ఆపుకున్నా నిద్ర ఆగడం లేదు. ఐదు నిమిషాలు అలా రెస్ట్ తీసుకుందామంటే.. పని ఆగిపోతుంది. బాస్ తన మీద నమ్మకంతో ఈ పని అప్పజెప్పాడు. ఇప్పుడెలా..? ఈ సమస్య రమేష్ది మాత్రమే కాదు. ఉద్యోగం చేసే చాలా మందిది. నిద్ర ఆపుకొని మరీ పనిచేస్తే అందులో తప్పులు దొర్లే అవకాశం ఉంది. అందుకే.. పని మధ్యలో నిద్రొస్తే కాసేపు పడుకొండి అంటున్నది జపాన్.
రోజంతా ఆఫీసులో పనిచేసి సాయంత్రం ఇంటికి చేరుకుంటాం. ఇంటికెళ్లే సరికి లేటవుతుంది. భార్యాభర్తలిద్దరూ ఉద్యోగస్తులైతే.. వారు వంట చేసుకొని తిని పడుకునే సరికి ఏ అర్ధరాత్రో అవుతుంది. మళ్లీ పొద్దున్నే లేచి ఉద్యోగానికి వెళ్లాలి. ఇలాంటి పరిస్థితుల్లో వారు సరిపడా నిద్ర పోతున్నారా? అంటే.. లేదనే చెప్పాలి. మధ్యాహ్నం ఆఫీసుకెళ్లి పనిచేసే సమయంలో కునుకిపాట్లు పడి.. బాస్తో చివాట్లు తింటారు. ఫలితంగా పని మీద కోపం వస్తుంది. చేసే పని మీద ధ్యాస ఉండదు. తప్పులు జరుగుతాయి. ఒత్తిడి పెరుగుతుంది. చివరికి.. ఈ ఎఫెక్ట్ అంతా ఆరోగ్యం మీద చూపిస్తుంది. అందుకే జపాన్లో చాలా కంపెనీలు తమ ఉద్యోగులకు ఆఫీసు టైమ్లో నిద్రొస్తే పడుకొమ్మని చెప్తున్నాయి.
కంపెనీలు జోల పాడుతున్నాయి..
ప్రపంచంలోనే ఎక్కువ పనిగంటలు పనిచేసే ఉద్యోగులు ఉన్న దేశం ఏదైనా ఉన్నదంటే అది జపాన్ మాత్రమే. అందుకే అణుబాంబు ప్రయోగం తర్వాత చాలా స్పీడుగా నిలదొక్కుకొని అభివృద్ధి చెందిన దేశాల సరసన నిలబడింది. ఎక్కువ పనిచేసి, ఆఫీసులోనే ఎక్కువ సమయం సంస్థ కోసం గడిపిన వారికి పని మధ్యలో కొద్దిసేపు రెస్ట్ తీసుకునే అవకాశం ఇస్తున్నారు. కంపెనీకి విధేయులై పనిచేస్తున్న ఉద్యోగులకు, తమ వ్యక్తిగత జీవితాన్ని కూడా త్యాగం చేసి సంస్థ అభివృద్ధి కోసం పనిచేస్తున్న ఉద్యోగుల సంక్షేమం కోసం జపాన్లో ఈ విధానం అమలు చేస్తున్నారు. ఆ మధ్య మివా సాడో అనే 31 సంవత్సరాల జర్నలిస్టు ఏకంగా 159 గంటలు నిద్రపోకుండా పనిచేసి హార్ట్ ఫెయిల్యూర్తో చనిపోయిన విషయం వార్తల్లోకెక్కింది.
ఫుకుషిమాలో టడాకి ఇగారి అనే 57 సంవత్సరాల మెకానిక్ న్యూక్లియర్ ప్లాంట్ కోసం రెండురోజులు నిద్ర లేకుండా పనిచేసి చనిపోయాడు. ఈ రెండు సంఘటనలు జరిగిన తర్వాత జపాన్ ప్రభుత్వం టీచర్లు, వైద్య విభాగంలో పనిచేసే ఉద్యోగులకు పని గంటల కంటే ఎక్కువ పని చేయొద్దని ఆదేశాలివ్వడం గమనార్హం. పనివేళలో నిద్ర వస్తే పడుకోమని కూడా సలహా ఇచ్చింది. అయితే.. జపాన్ పౌరులు మాత్రం నిద్రకు దూరమై పనిచేయాల్సిన అవసరం లేదని నిర్ణయం తీసుకుంది. పనిచేస్తున్న సమయంలో మధ్యలో నిద్ర వస్తే హాయిగా కొద్దిసేపు కునుకు తీయవచ్చని అక్కడి కంపెనీలు అనుమతి ఇస్తున్నాయి.
నిద్ర సరిపోక ఆఫీసు సమయంలో చాలామంది కునుకి పాట్లు తీస్తుంటారు. అయితే.. ఆఫీసు సమయంలో నిద్ర వస్తే.. కొన్ని నిమిషాలు కళ్లు మూసుకోండి.
లేకపోతే మెదడు మీద ఒత్తిడి పెరిగి ఆ ప్రభావం గుండె మీద చూపిస్తుంది. ఫలితంగా గుండె ఆరోగ్యం దెబ్బతింటుంది.
రాత్రి సరిపడా నిద్రపోయినప్పటికీ ఎక్కువసేపు కూర్చొని పనిచేయడం వల్ల కూడా నిద్రమత్తు వస్తుంది. ఇలాంటిప్పుడు మెదడు అలసిపోయిందని గ్రహించాలి.
కొద్దిసేపు మెదడుకు విశ్రాంతినిస్తూ చేస్తున్న పని నుంచి కొద్దిసేపు మనసు, మెదడు పక్కకు మళ్లించాలి. అవసరమైతే కళ్లు మూసుకొని కొద్దిసేపు ఉండడం బెటర్.
జపాన్లోలాగ మనదేశంలో ఆఫీసు సమయంలో నిద్ర వస్తే కాసేపు పడుకోమని ప్రోత్సహించే సంస్థలు లేవు. గూగుల్, మైక్రోసాఫ్ట్ లాంటి కొన్ని సంస్థలు ఉద్యోగులకు ఈ సదుపాయాలు కల్పిస్తున్నా.. పూర్తిస్థాయిలో మాత్రం ఇంకా అందుబాటులోకి రాలేదనే చెప్పాలి.
అలాగని ఎక్కువసేపు పడుకుంటే కూడా సృజనాత్మక శక్తి తగ్గిపోయి సోమరితనం ఆవరిస్తుంది. అందుకే.. శరీరానికి సరిపడేంతగా నిద్రపొండి. ఆరోగ్యాన్ని కాపాడుకోండి.
మెదడు మీద ఒత్తిడి తగ్గుతుంది..
టోక్యోకు చెందిన ఓ వెడ్డింగ్ ఆర్గనైజర్ కంపెనీ తమ దగ్గర పనిచేసే వారిలో ఎవరైతే రాత్రుళ్లు ఆరు గంటలు హాయిగా నిద్రపోతారో వారికి రివార్డులు కూడా ఇస్తుంది. నెక్ట్స్ బీట్ అనే మరో ఐటీ కంపెనీ ఉద్యోగుల కోసం ఏసీలు బిగించి మరీ.. పడుకోడానికి రూమ్లు ఏర్పాటు చేసింది. నిద్రను పణంగా పెట్టి పని చేయడం అంటే.. పాయింట్ బ్లాంక్లో తుపాకీ పెట్టుకొని ట్రిగ్గర్ మీద వేలు పెట్టి పనిచేయడమే అంటున్నారు అక్కడి సైకియాట్రిస్టులు. ఇలా చేయడం వల్ల రకరకాల ఆరోగ్య సమస్యలు ఎదుర్కోవడమే కాకుండా.. చేసే పనిలో ఫలితం అనుకున్నంతగా రాదంటున్నారు వారు.
ఈ దశలో వరల్డ్ ఎకనామిక్స్ ఫోరం వెల్లడించిన నివేదికలో ఎక్కువ నిద్రపోయే దేశాలు, తక్కువ నిద్రపోయే దేశాల జాబితాను ప్రకటించింది. ఈ జాబితాలో నిద్రా సమయం కంటే ఐదున్నరనిమిషాలు ఎక్కువే నిద్రపోయి.. మొదటి స్థానంలో ఉంది నెదర్లాండ్స్. శరీరానికి కావల్సిన దాని కంటే 36 నిమిషాలు తక్కువ నిద్రపోతూ చివరి స్థానంలో సింగపూర్ ఉంది. అయితే.. మనదేశం ఈ జాబితాలో లేదు.
ఈ విషయంలో ప్రభుత్వం సైతం స్పందించి ప్రకటనలు చేయడం గమనించాల్సిన విషయం. జపాన్ ప్రజల ఆరోగ్య, మానసికపరిస్థితుల స్టడీస్ గమనించిన తర్వాత జపాన్ ఆరోగ్య శాఖ మంత్రి ఉద్యోగులకు, యువతకు, విద్యార్థులకు నిద్ర విషయంలో పలు గైడెన్స్లు ఇచ్చారు. ‘దేశ జీడీపీ పెరగాలన్నా, తలసరి ఆదాయం పెరగాలన్నా ముందు అందరూ ఆరోగ్యంగా ఉండాలి. ఆరోగ్యంగా ఉండడం వల్ల చేసే పని లోపాలు లేకుండా చేయగలుగుతారు.
అందుకే.. శరీరానికి కావల్సినంతసేపు హాయిగా నిద్రపొండి. మీ మెదడు ఒత్తిడి నుంచి విముక్తి అనిపించినప్పుడే పని మొదలుపెట్టండి’ అంటూ సందేశమిచ్చారు. నిద్రలేమితో పనిచేయడం వల్ల 2009లో జపాన్ 2.92 శాతం జీడీపీ తగ్గిందని ఓ స్టడీలో తేలింది. దీని విలువ 138 డాలర్లు.
అందుకే.. జపాన్ ఉద్యోగులను పని సమయంలో నిద్రపోవడానికి వీలుగా తగు ఏర్పాట్లు చేస్తున్నది. నిద్రపోయిన సమయాన్ని అదనంగా పనిచేసి భర్తీ చేసుకోవాలి. అంటే.. నిద్రొచ్చినప్పుడు పడుకోవాలి.. మెలకువ వచ్చినప్పుడు పనిచేయాలన్నమాట.