
చంద్రబాబు అరెస్ట్ తరువాత ఏపీలో రాజకీయ పరిణామాలు మరింతగా వేడెక్కాయి. రాబోయే ఎన్నికల కోసం సిద్ధమవుతున్న టీడీపీకి చంద్రబాబు(Chandrababu Naidu) అరెస్ట్ పరిణామం ఊహించని షాక్ ఇచ్చింది. చంద్రబాబు అరెస్ట్ కావడం.. ఆయనకు జ్యుడీషియల్ రిమాండ్ విధించడంతో టీడీపీ(TDP) శ్రేణుల్లో ఆందోళన మొదలైంది. తన తండ్రి అరెస్ట్ కావడంతో... యువగళం పాదయాత్రకు తాతాల్కికంగా విరామం ప్రకటించిన ఆ పార్టీ యువనేత, మాజీమంత్రి నారా లోకేశ్.. రాజమండ్రిలోనే మకాం పెట్టారు. ప్రతిక్షణం అభివృద్ధి గురించి ఆలోచించే వ్యక్తి చంద్రబాబు అని నారా లోకేష్ అన్నారు.
తాను ఎక్కడికి పారిపోవడం లేదు.. రాజమండ్రిలో ఉండి సవాల్ చేస్తున్నానని లోకేష్ చెప్పుకొచ్చారు. తనను అరెస్టు చేయాలనుకుంటే చేసుకోండి అంటూ లోకేష్ సవాల్ చేశారు. చంద్రబాబును కించపరచాలనే ఉద్దేశంతోనే ఆయన జైలులోకి వెళ్తున్న వీడియోలను బయటపెట్టారని లోకేష్ ఆవేదన వ్యక్తం చేశారు. మా పార్టీ అధినేత పై దాడి జరుగుతోందని.. దానిని ఆపాల్సిన బాధ్యత నాపై ఉందంటూ లోకేష్ చెప్పుకొచ్చారు. అందుకే యువ గళం పాదయాత్రను తాత్కాలికంగా నిలిపివేసినట్లు ప్రకటించారు. అతి త్వరలో మళ్లీ ప్రారంభిస్తామని చెప్పుకొచ్చారు.చంద్రబాబుపై అవినీతి మరక వేసే ప్రయత్నం వైసీపీ ప్రభుత్వం చేస్తోందన్నారు నారా లోకేష్. అవినీతి అనేది చంద్రబాబు రక్తంలోనే లేదంటూ.. దేశ రాజకీయాల్లో చంద్రబాబు గుర్తింపు పొందారన్నారు. స్కిల్ డెవలప్మెంట్లో 42 సెంటర్లు ప్రారంభించి 2.13 లక్షల మందికి ఉద్యోగాలు కల్పించామన్నారు. కోడికత్తి కేసులో ఎంత అబద్దం ఉందో స్కిల్ డెవలప్మెంట్ కేసులో కూడా అంతే అబద్ధం ఉందని తేల్చి చెప్పారు. చంద్రబాబుకు డబ్బు ఎక్కడ నుంచి వచ్చిందో నిరూపించగలరా అని ప్రశ్నించారు.
చంద్రబాబు కేసులో అవినీతి జరిగిందన్నది అంతే నిజమని టిడిపి యువనేత నారా లోకేష్ తేల్చి చెప్పారు. చంద్రబాబు అక్రమ అరెస్టు నేపథ్యంలో పాదయాత్రకు తాత్కాలికంగా బ్రేక్ ఇచ్చిన సంగతి తెలిసిందే. చంద్రబాబు బెయిల్ పిటిషన్లు, టిడిపి నేతలతో ఎప్పటికప్పుడు సమన్వయం చేసుకుంటూ వచ్చిన లోకేష్ సోమవారం ( సెప్టెంబర్ 11) సాయంత్రం మీడియా సమావేశంలో మాట్లాడారు. భావోద్వేగంతో పాటు గత నాలుగు దశాబ్దాలుగా చంద్రబాబు రాజకీయ జీవితం గురించి ప్రస్తావించారు. కొన్ని సంచలన వ్యాఖ్యలు కూడా చేశారు. తన తండ్రి అక్రమ కేసులు విషయంలో.. న్యాయాన్ని నిలబెట్టే ప్రక్రియలో ఎన్ని కుట్రలనైనా ఎదుర్కొంటామని లోకేష్ స్పష్టం చేశారు. తమ ఆస్తులపై కూడా స్పష్టమైన ప్రకటన చేశారు. మేము ఏటా ప్రకటించిన ఆస్తులు కంటే అదనంగా ఉంటే.. చూపించండి ఇచ్చేస్తామంటూ సవాల్ చేశారు.
చంద్రబాబు పై అక్రమ కేసు పెట్టి అరెస్టు చేయడం తెలుగుదేశం పార్టీకి ఒక స్పీడ్ బ్రేకర్ మాత్రమేనని లోకేష్ తేల్చి చెప్పారు. తెలుగుదేశం ఆవిర్భావం తర్వాత ఎన్నో సంక్షోభాలను ఎదుర్కొని బయటపడిందని.. ఇప్పుడు కూడా చంద్రబాబు కడిగిన ముత్యంలో బయటకు వస్తారని లోకేష్ ఆశా భావం వ్యక్తం చేశారు. సైకో జగన్ మాకు ఒక లెక్క కాదని తేల్చి చెప్పారు. రాష్ట్రంలో విపక్ష నాయకులు, జాతీయస్థాయి నాయకులు సైతం చంద్రబాబు అరెస్టును ఖండించారని.. తమకు మద్దతుగా నిలిచారని లోకేష్ కృతజ్ఞతలు తెలిపారు. ఏపీ ప్రజలు స్వచ్ఛందంగా టిడిపి బందులో పాల్గొనడం ఆనందంగా ఉందని చెప్పుకొచ్చారు.
అటు పవన్ కళ్యాణ్ పై లోకేష్ ప్రశంసలు కురిపించారు. ఎంతటి కష్టంలో పవన్ తనకు అన్నయ్యగా అండగా నిలిచారని కృతజ్ఞతలు తెలిపారు. ఆయనతో కలిసి నడుస్తామని ప్రకటించారు. పాముకు తలలోనే విషం ఉంటుందని.. జగన్ కు ఒళ్లంతా విషమేనని లోకేష్ ఆరోపించారు. చంద్రబాబుకు అవినీతి మరక అంటించేందుకు జగన్ ప్రయత్నిస్తున్నారని.. అది జరిగే పని కాదని తేల్చి చెప్పారు. న్యాయం నిలబడే వరకు అవిశ్రాంతంగా పోరాడుతానని.. అనవసరంగా చంద్రబాబు జోలికి వెళ్లానని… జగన్ పశ్చాత్తాప పడతారని లోకేష్ హెచ్చరించారు. చంద్రబాబుది అభివృద్ధి అభిమతమని.. హుందా రాజకీయాలే చేశారని గుర్తు చేశారు. దేశ రాజకీయాల్లో చంద్రబాబు అరుదైన వ్యక్తి అని.. అటువంటి వ్యక్తిపై తప్పుడు కేసులు పెట్టారని.. వాటిని ధైర్యంగా ఎదుర్కొంటామని లోకేష్ ప్రకటించారు.