గ్రాండ్‌గా 70వ జాతీయ అవార్డుల సంబురం

గ్రాండ్‌గా 70వ జాతీయ అవార్డుల సంబురం

70వ జాతీయ చలనచిత్ర అవార్డుల ప్రదానోత్సవం ఢిల్లీలో ఘనంగా జరిగింది. మంగళవారం రాష్ట్రపతి భవన్‌‌‌‌‌‌‌‌లో జరిగిన కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము విజేతలకు పురస్కారాలను అందజేసి, అభినందనలు తెలియజేశారు.  2022 సంవత్సరానికి గానూ వివిధ విభాగాల్లో ఈ అవార్డులను అందజేశారు. కొవిడ్ కారణంగా అవార్డులు ఆలస్యం అయ్యాయి.  బాలీవుడ్‌‌‌‌‌‌‌‌ సీనియర్‌‌‌‌‌‌‌‌ నటుడు మిథున్‌‌‌‌‌‌‌‌ చక్రవర్తిని దాదాసాహెబ్‌‌‌‌‌‌‌‌ ఫాల్కే అవార్డుతో సత్కరించారు. తెలుగు నుంచి ఉత్తమ ప్రాంతీయ చిత్రంగా నిలిచిన ‘కార్తికేయ 2’ సినిమాకు గాను,  దర్శకుడు చందు మొండేటి, నిర్మాత అభిషేక్ అగర్వాల్ రాష్ట్రపతి నుంచి అవార్డును స్వీకరించారు.  

హీరో నిఖిల్ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నాడు. ఉత్తమ నటుడిగా రిషబ్ శెట్టి (కాంతార),  ఉత్తమ నటిగా నిత్యా మీనన్ (తిరుచిత్రంబలం),  మానసి పరేఖ్‌‌‌‌‌‌‌‌ (కచ్ ఎక్స్‌‌‌‌‌‌‌‌ప్రెస్‌‌‌‌‌‌‌‌) అవార్డులను అందుకున్నారు. మలయాళ సినిమా ‘ఆట్టం’ను బెస్ట్ ఫీచర్ ఫిల్మ్ అవార్డు వరించింది. బెస్ట్ పాపులర్ సినిమాగా ‘కాంతార’కు అవార్డు లభించింది. ఉత్తమ తమిళ చిత్రంగా ‘పొన్నియిన్ సెల్వన్ పార్ట్‌‌‌‌‌‌‌‌ 1’కు దర్శకుడు మణిరత్నం, నిర్మాత సుభాస్కరన్ అవార్డును అందుకున్నారు. ఉత్తమ హిందీ చిత్రంగా ‘గుల్‌‌‌‌‌‌‌‌ మొహర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌’, ఉత్తమ మలయాళ చిత్రంగా ‘సౌదీ వేలక్క’,  ఉత్తమ కన్నడ చిత్రంగా ‘కేజీఎఫ్‌‌‌‌‌‌‌‌ 2’ నిలిచాయి.  

ఉత్తమ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ విభాగంలో ‘పొన్నియన్ సెల్వన్‌‌‌‌‌‌‌‌ పార్టు 1’కు ఏఆర్ రెహమాన్‌‌‌‌‌‌‌‌ అవార్డును స్వీకరించారు.  ఆయనకు ఇది ఏడో నేషనల్ ఫిల్మ్ అవార్డు.  ‘ఉంఛై’ చిత్రానికి ఉత్తమ దర్శకుడిగా సూరజ్ బర్జాత్యా అవార్డును అందుకున్నారు. ‘గుల్‌‌‌‌‌‌‌‌ మొహర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌’లో నటనకు గాను మనోజ్ బాయ్‌‌‌‌‌‌‌‌పాయ్‌‌‌‌‌‌‌‌ను ప్రత్యేకంగా ప్రస్తావిస్తూ  అవార్డును అందజేశారు.  ఇక బెస్ట్ చైల్డ్‌‌‌‌‌‌‌‌ ఆర్టిస్ట్‌‌‌‌‌‌‌‌గా శ్రీపత్‌‌‌‌‌‌‌‌ (మాలికాపురం), తన పుట్టినరోజునే అవార్డును అందుకున్నాడు. ‘కాంతార’ చిత్రానికి రెండు అవార్డులు రావడంపై ఆనందం వ్యక్తం చేసిన రిషబ్ శెట్టి.. 

ప్రాంతీయ చిత్రాలను అవార్డులతో ప్రోత్సహిస్తే, ఎంతోమంది దర్శకనిర్మాతలు ఇలాంటి చిత్రాలు తీసేందుకు ముందుకొస్తారని చెప్పాడు.  జాతీయ అవార్డును అందుకోవడం అద్భుతమైన అనుభూతిని అందిస్తోందని, తన పదిహేనేళ్ల కష్టానికి తగ్గ ప్రతిఫలంగా దీన్ని భావిస్తున్నానని నిత్యామీనన్ చెప్పింది. తన కో యాక్టర్స్,  ‘తిరుచిత్రంబలం’ టీమ్‌‌‌‌‌‌‌‌కు అవార్డును అంకితం ఇస్తున్నట్టు ఆమె పేర్కొన్నారు.  

ఇక తమిళ చిత్రం ‘తిరుచిత్రంబలం’కు గానూ కొరియోగ్రాఫర్‌‌‌‌‌‌‌‌ జానీ మాస్టర్‌‌‌‌‌‌‌‌కు ప్రకటించిన జాతీయ అవార్డును రద్దు చేశారు. లైంగిక వేధింపులతో పాటు పోక్సో చట్టం కింద కేసు నమోదు అవడంతో కేంద్రం అవార్డును రద్దు చేస్తున్నట్టు ప్రకటించింది.