పంతం నెగ్గించుకున్న కెప్టెన్.. సిద్ధూ రాజీనామా

పంతం నెగ్గించుకున్న కెప్టెన్.. సిద్ధూ రాజీనామా
  • 72 రోజులకే పీసీసీ చీఫ్ పదవికి సిద్ధూ రాజీనామా

పంజాబ్ కాంగ్రెస్ చీఫ్​ పదవికి నవజోత్ సింగ్ సిద్ధూ రాజీనామా చేశారు. అయితే పీసీసీ చీఫ్ పదవి వదులుకున్నప్పటికీ.. కాంగ్రెస్ పార్టీకి తన సేవలను కొనసాగిస్తానని చెప్పారు. ఒక వ్యక్తి ఏదైనా విషయంలో రాజీపడితే అతడి వ్యక్తిత్వం కోల్పోయినట్లు భావిస్తామని.. పంజాబ్ భవిష్యత్తు, సంక్షేమం విషయంలో తాను ఎప్పటికీ రాజీపడనని సిద్ధూ స్పష్టం చేశారు. అందుకే పంజాబ్ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్ష పదవికి రాజీనామా చేస్తున్నానని తెలిపారు. ఈ విషయాలను కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీకి పంపిన లేఖలో ఆయన పేర్కొన్నారు.

కెప్టెన్ వ్యాఖ్యల వల్లేనా?

ఇటీవల పంజాబ్‌లో పవర్‌‌ పాలిటిక్స్‌లో ఇటు సిద్ధూ, అటు కెప్టెన్ అమరిందర్‌‌ మధ్య హోరాహోరీ పోరు నడిచింది. కెప్టెన్‌కు వ్యతిరేకంగా సిద్ధూ పావులు కదిపి.. హైకమాండ్‌తో సుదీర్ఘ చర్చల తర్వాత పీసీసీ చీఫ్‌ పదవి పొందారు. ఆ తర్వాత సిద్ధూ నడిపిన మంత్రాంగంతో కెప్టెన్ పంజాబ్ సీఎం పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది. అయితే ఆ సమయంలో సిద్ధూ సీఎం కావాలని ప్రయత్నించినట్లు పంజాబ్ పీసీసీ వర్గాల్లో వినిపించింది. అయితే ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసిన కెప్టెన్‌.. ఆ రోజున సిద్ధూపై తీవ్రమైన ఆరోపణలు చేశారు. సిద్ధూ అసమర్థుడని, నిలకడలేని వ్యక్తి అని, ఆయనకు పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్, ఆ దేశ ఆర్మీ చీఫ్ బజ్వాలతో సంబంధాలు ఉన్నాయని అన్నారు. పాకిస్థాన్‌తో సరిహద్దు కలిగి ఉన్న పంజాబ్‌కు సిద్ధూను సీఎంగా చేస్తే ఆయన వల్ల రాష్ట్రానికి, దేశానికి ప్రమాదమని, ఆయన సీఎంను చేస్తే తాను సహించనని కెప్టెన్ స్పష్టం చేశారు. దీంతో కాంగ్రెస్ హైకమాండ్ పంజాబ్ సీఎం పదవికి చరణ్‌జిత్ సింగ్ చన్నీని ఎంపిక చేసింది. అయితే నాడు కెప్టెన్ చేసిన కామెంట్స్ వల్లే సిద్ధూ పీసీసీ పదవిలోకి వచ్చిన 72 రోజులకే రాజీనామా చేయాల్సి వచ్చిందని పంజాబ్ కాంగ్రెస్‌లో గుసగుసలు వినిపిస్తున్నాయి. తాను సీఎం పదవికి కోల్పోయినా.. సిద్ధూపై కెప్టెన్ పంతం నెగ్గించుకున్నారని కొందరు నేతలు చర్చించుకుంటున్నారు.

మరిన్ని వార్తల కోసం..

షెడ్యూల్ ప్రకారమే బైపోల్.. వాయిదాకు హైకోర్టు నో

మండలిలో కవిత చెప్పింది నిజం కాదా?