
న్యూఢిల్లీ: ఇండియా స్పోర్టింగ్ ఐకాన్స్ నీరజ్ చోప్రా, పీవీ సింధు, విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ తదితరులు దేశ సాయుధ దళాలకు తమ మద్దతు ప్రకటించారు. పాకిస్తాన్లోని ఉగ్రవాద స్థావరాలపై మన సైన్యం చేపట్టిన దాడులను సమర్థించారు. తమ సోషల్ మీడియా వేదికల ద్వారా ఆర్మీకి సంఘీభావం ప్రకటించారు. సైన్యాన్ని దేశం ఆత్మగా అభివర్ణించారు. ‘మన ఆర్మీ, ఎయిర్ఫోర్స్, నేవీ చేసే ప్రతి పని, తీసుకునే ప్రతి నిర్ణయానికి నేనెంతో గర్వపడుతున్నా. మన యోధులు దేశ గౌరవం కోసం నిలబడుతున్నారు. ఈ టైమ్లో ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా వ్యవహరించాలి.
ఫేక్ న్యూస్ను వ్యాప్తి చేయడం, వాటిని నమ్మడం మానుకోవాలి. అందరూ సేఫ్గా ఉండండి’ అని రోహిత్ ఎక్స్లో పోస్ట్ చేశాడు. ‘ఈ క్లిష్ట సమయంలో మన దేశాన్ని రక్షిస్తున్న సాయుధ దళాలకు సంఘీభావం ప్రకటిస్తున్నాం. వారి ధైర్యానికి సెల్యూట్ చేస్తున్నాం. వారు, వారి కుటుంబాలు చేసే త్యాగాలకు మనం ఎప్పటికీ రుణపడి ఉంటాం’ అని కోహ్లీ ఇన్స్టాగ్రామ్లో రాశాడు. సాయుధ దళాలు ఉగ్రవాదానికి వ్యతిరేకంగా పోరాడుతున్నందుకు గర్విస్తున్నానని, ఈ సమయంలో అందరి భద్రత కోసం ప్రభుత్వ మార్గదర్శకాలను పాటిద్దామని డబుల్ ఒలింపిక్ మెడలిస్ట్ నీరజ్ చోప్రా పేర్కొన్నాడు. ‘మన సాయుధ దళాల ధైర్యం, క్రమశిక్షణ, త్యాగమే మన దేశ ఆత్మ. ఆపరేషన్ సిందూర్ వంటి క్షణాలు మన త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసే నిశ్శబ్ద శక్తిని, నిస్వార్థ సేవను గుర్తు చేస్తాయి. భారత్ మీతో ఉంది.
జై హింద్’ స్టార్ షట్లర్ సింధు రాసుకొచ్చింది. పాకిస్తాన్ యుద్ధాన్ని ఎంచుకుందని సెహ్వాగ్ అన్నాడు. ‘నిశ్శబ్దంగా ఉండే అవకాశం ఉన్నప్పటికీ పాక్ యుద్ధాన్ని ఎంచుకుంది. తమ ఉగ్రవాద ఆస్తులను కాపాడుకోవడానికి ఉద్రిక్తతలను పెంచింది. మన సైన్యం సరైన రీతిలో, పాక్ ఎప్పటికీ మరచిపోలేని విధంగా స్పందిస్తోంది’ అని ఎక్స్లో పేర్కొన్నాడు. శిఖర్ ధవన్, జస్ప్రీత్ బుమ్రా, సూర్యకుమార్ యాదవ్ తదితరులు కూడా సైన్యానికి సంఘీభావంగా పోస్టులు చేశారు.