NEET ఎగ్జామ్ రాసే విద్యార్థులకు డ్రెస్ కోడ్ మస్ట్

NEET ఎగ్జామ్ రాసే విద్యార్థులకు డ్రెస్ కోడ్ మస్ట్

దేశవ్యాప్తంగా మెడికల్ కాలేజీల్లో ప్రవేశానికి నీట్ పరీక్ష నిర్వహించేందుకు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) అన్ని ఏర్పాటు పూర్తిచేసింది. సెప్టెంబర్ 12న జాతీయ స్థాయి నీట్ పరీక్ష జరుగనుంది. అయితే నీట్ పరీక్షకు హాజరయ్యే విద్యార్థులంతా డ్రెస్ కోడ్ తప్పనిసరిగా పాటించాలని NTA ఆదేశించింది. పరీక్ష రాసే విద్యార్థులకు ప్రత్యేక డ్రెస్ కోడ్ నిబంధనలను ప్రకటించింది. అమ్మాయిలు చెవిపొగులు, చైన్లు, నగలు ధరించి రావొద్దని ఆదేశించింది. అలాగే అబ్బాయిలు కూడా పొడుగు చేతుల చొక్కాలు, బూట్లు వేసుకోవద్దని తెలిపింది.

అంతేకాదు.. నీట్ పరీక్ష రాసే విద్యార్థులు లేత రంగు బట్టలు మాత్రమే ధరించాల్సి ఉంటుంది. అమ్మాయిలతో పాటు అబ్బాయిలూ పొడుగు చేతులు ఉండే బట్టలు ధరించవద్దు. మతపరమైన సంప్రదాయం ప్రకారం దుస్తులు ధరించాల్సి వస్తే మాత్రం.. ఆ విద్యార్థులు మధ్యాహ్నం 12.30 గంటల లోపు పరీక్ష కేంద్రానికి రావాల్సి ఉంటుంది. వారిని పరీక్ష కేంద్రంలో తనిఖీ చేసిన తర్వాత లోపలికి అనుమతిస్తారు. నీట్ పరీక్ష రాసే అభ్యర్థులు ఎవరూ బూట్లు ధరించవద్దు. అలా వస్తే పరీక్షా కేంద్రంలోకి ఎంట్రీ ఉండదు. తక్కువ హీల్ ఉండే సాండిల్స్, స్లిప్పర్లను మాత్రమే ధరించాల్సి ఉంటుంది. పౌచ్, గాగుల్స్, వ్యాలెట్, టోపీలు, హ్యాండ్ బ్యాగ్స్ తీసుకురావొద్దని నిబంధనల్లో తెలిపింది.

పెన్సిల్ బాక్సులు, కాలిక్యూలేటర్లు, స్కేల్, పెన్నులు, రైటింగ్ ప్యాడ్స్ కూడా లోపలికి అనుమతించరు. ఇక మొబైల్ ఫోన్, ఇయర్ ఫోన్స్, హెల్త్ బ్యాండ్స్, బ్లూటూత్, స్మార్ట్ వాచ్ లతో పాటు ఎలక్ట్రానిక్ డివైజ్ లను వెంట తీసుకురావొద్దని ఆదేశాల్లో తెలిపింది. నీట్ పరీక్ష రాసే అభ్యర్థులు వెంట ఎలాంటి ఆహార పదార్థాలు, వాటర్ బాటిళ్లు తీసుకురావొద్దని, ఒకవేళ వెంట తీసుకొచ్చిన పరీక్షా కేంద్రంలోకి అనుమతించేది లేదని NTA తెలిపింది.

దేశవ్యాప్తంగా వచ్చే ఆదివారం (సెప్టెంబర్ 12) నీట్ పరీక్షను NTA నిర్వహించనుంది. ఈ పరీక్ష విధానం ఇంగ్లిష్, హిందీతో పాటు 11 ప్రాంతీయ భాషల్లో పెన్ అండ్ పేపర్ పద్ధతిలో నిర్వహించనున్నారు. మధ్యాహ్నం 2 గంటల నుంచి 5 గంటల వరకు నీట్ పరీక్షను నిర్వహించనున్నారు. ఈ పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు ఒక గంట ముందే పరీక్షా కేంద్రానికి చేరుకోవాల్సి ఉంటుంది. కరోనా కారణంగా పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులకు థర్మల్ స్క్రీనింగ్ నిర్వహించనున్నారు.