వైద్యుల నిర్లక్ష్యంతో బాలింత మృతి.. బంధువుల ఆందోళన

వైద్యుల నిర్లక్ష్యంతో బాలింత మృతి.. బంధువుల ఆందోళన

మహబూబాబాద్‌ జిల్లాలోని ఓ ఆసుత్రిలో బాలింత మృతి చెందడం కలకలం రేపింది. బయ్యారం మండలం సత్యనారాయణపురం గ్రామానికి చెందిన నేహా(27) కాన్పు కోసం ఆసుపత్రికి తీసుకువెళ్లారు. ఆ తర్వాత ఆమెకు వైద్యులు కాన్పు చేశారు. నేహా పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. అయితే పాప క్షేమంగానే ఉంది కానీ.. కాన్పు అయిన తర్వాత నేహా చనిపోయింది. దీంతో మృతురాలి భర్త అనిల్ ఆవేదన వ్యక్తం చేశాడు. 

డాక్టర్ల నిర్లక్ష్యంతోనే నేహా చనిపోయిందని ఆసుపత్రి ముందు మృతురాలి బంధువులు ఆందోళనకు దిగారు. వారికి మద్దతుగా బహుజన్ సమాజ్ పార్టీ, లంబాడి హక్కుల పోరాట సమితి సభ్యులు నిరసన వ్యక్తం చేశారు. తమకు న్యాయం జరిగే వరకు ఆసుపత్రి ముందు నుంచి కదిలేదే లేదని భీష్మించుకొని కూర్చున్నారు. నేహాకు డెలివరీ చేసిన వైద్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. దీంతో ఆసుపత్రి ముందు ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు, ఆందోళనకారులను చెదరగొట్టారు. విచారణ కమిటీ వేసి సమగ్ర విచారణ జరుపుతామని పోలీసులు నేహా బంధువులకు వివరించారు.