లారీ-కారు ఢీ.. ఒకే కుటుంబీకులు నలుగురు మృతి

లారీ-కారు ఢీ.. ఒకే కుటుంబీకులు నలుగురు మృతి
  • నెల్లూరు జిల్లా గూడూరు ఆదిశంకర కాలేజీ వద్ద ప్రమాదం
  • తిరుపతి నుంచి నెల్లూరు వెళ్తున్న కారును ఢీకొన్న లారీ

నెల్లూరు: చెన్నై-కోల్ కతా జాతీయ రహదారిపై గూడూరు ఆదిశంకర ఇంజనీరింగ్ కాలేజీ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కారులో వెళ్తున్న ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి చెందారు. వీరంతా తిరుపతి నుంచి కారులో రాజమండ్రికి వెళ్తుండగా ప్రమాదం జరిగింది. చనిపోయిన వారు రాజమండ్రికి చెందిన వీరయ్య, వరలక్ష్మీ, మణికంఠ, స్వాతి గా గుర్తించారు. కారులో ప్రయాణిస్తున్న లిఖిత అనే మరో యువతికి తీవ్ర గాయాలు కావడంతో చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. 
బ్రిడ్జి నిర్మాణం కారణంగా సింగిల్ రోడ్డుపై రాకపోకలు
జాతీయ రహదారిపై కొంతకాలంగా జరుగుతున్న బ్రిడ్జి నిర్మాణం పూర్తి కాలేదు. దీంతో సింగిల్ రోడ్డుపైనే వాహనాలు రాకపోకలు సాగిస్తున్నా.. అధికారులు పట్టించుకోవడం లేదన్న విమర్శలు ఉన్నాయి. తరచూ ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నా ఎవరూ పట్టించుకోకపోవడంతో రోజుకు రెండు నుంచి ఐదు వరకు ప్రమాదాలు జరుగుతున్నట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు. ఇవాళ ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి చెందడం కలకలం రేపింది.