9 కిలోల వెండి స్వాధీనం
జూబ్లీహిల్స్, వెలుగు: జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో గత నెల15న జరిగిన దొంగతనం కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. తాము పని చేస్తున్న ఇంట్లో భారీ చోరీ చేసిన నేపాలీ దొంగలు పారిపోతూ 9 కిలోల వెండిని ఢిల్లీలో వదిలిపోయారు. దీంతో జూబ్లీహిల్స్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. జూబ్లీహిల్స్ఓబుల్ రెడ్డి స్కూల్వెనుక గేటు ఎదురుగా ఉన్న రోడ్ నంబర్ 25లోని ప్లాట్ నంబర్ 305లో వ్యాపారవేత్త అనిరుధ్ రెడ్డి, దీపికా రెడ్డి ఉంటున్నారు.
వీరి ఇంట్లో పని చేస్తున్న నేపాలీలు సుమారు రూ.2 కోట్ల విలువైన బంగారం, వజ్రాభరణాలను దొంగిలించి పరారయ్యారు. ఈ కేసును సీరియస్గా తీసుకున్న జూబ్లీహిల్స్ పోలీసులు దర్యాప్తులో భాగంగా ఓ నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారించారు. అతడు ఇచ్చిన సమాచారంతో ఢిల్లీలోని ఓ ప్రాంతంలో వదిలివెళ్లిన 9 కిలోల వెండి మూటను స్వాధీనం చేసుకున్నారు. వజ్రాభరణాలతో నేపాల్ పారిపోయే క్రమంలో బరువు తగ్గించుకునేందుకు వెండిని వదిలివెళ్లినట్లు వెల్లడైంది. ఈ కేసులో ప్రధాన నిందితులుగా భావిస్తున్న మహేశ్ షాహి (32), అప్సర షాహి ఇప్పటికే నేపాల్కు చేరుకున్నట్లు సమాచారం.
