రూ.2,870 కోట్ల పెట్టుబడులు
10 కోట్ల మంది కొత్త సబ్ స్క్రైబర్లు ఇండియన్లే ఉంటారు
‘ఇండియా కంటెంట్’తో ఇకపై షోలు, సినిమాలు
కంటెంట్ ఉంటే ఎంతపెట్టైనా చూస్తారు
కంపెనీ సీఈవో రీడ్ హేస్టింగ్స్
ఇండియా మార్కెట్పై నెట్ ఫ్లిక్స్ గురిపెట్టింది. అమెజాన్ప్రైమ్, హాట్స్టార్ బాటలోనే పెట్టుబడులకు రెడీ అయిపోతోంది. కస్టమర్ల బేస్ పెంచుకునేందుకు కసరత్తులు చేస్తోంది. ఈ ఏడాదికిగాను సుమారు రూ.2,870 కోట్లు ఇన్వెస్ట్ చేయడానికి సిద్ధమైంది. ఈ విషయాన్ని నెట్ఫ్లిక్స్ సీఈవో రీడ్ హేస్టింగ్స్ వెల్లడించారు. ఇటీవల జరిగిన హిందూస్థాన్ టైమ్స్ లీడర్షిప్ సమ్మిట్కు హాజరైన ఆయన ఈ విషయాలను వెల్లడించారు. ప్రత్యేకంగా ‘ఇండియా కంటెంట్’కు ఇక్కడ ప్రాధాన్యమిస్తామని చెప్పారు. అయితే, ఇప్పటికే ఇండియాలో జరిగిన సంఘటనల ఆధారంగా ఇప్పటికే కొన్ని సిరీస్లు, సినిమాలను ప్రసారం చేసిన నెట్ఫ్లిక్స్, ఇకపై చేయబోయే సినిమాలు, సిరీస్లేంటో మాత్రం ఆయన చెప్పలేదు.
ఇది ఆరంభమే
ఆన్లైన్ స్ట్రీమింగ్కు ఇండియాలో స్కోప్ ఉందని రీడ్ హేస్టింగ్స్ చెప్పారు. అయితే, తమకు మాత్రం ఇది జస్ట్ ఆరంభం మాత్రమేనని, మున్ముందు కస్టమర్ బేస్ పెంచుకుంటామని అన్నారు. ప్రస్తుతం ఎంత మంది సబ్స్క్రయిబర్లున్నారన్నది మాత్రం చెప్పలేదు. కానీ, తర్వాత చేరబోయే 10 కోట్ల మంది సబ్స్క్రయిబర్లు ఇండియా నుంచే ఉంటారని అన్నారు. ‘‘ఇండియాలో ఇంటర్నెట్ గ్రోత్ బాగా పెరిగిపోతోంది. వాడకమూ ఎక్కువైంది. కాబట్టి మాకు సబ్స్క్రయిబర్లు పెరగడానికి అదే తోవ చూపిస్తుంది’’ అని అన్నారు. కాగా, ఇండస్ట్రీ అనలిస్టులు, మీడియా పార్ట్నర్స్ ఆసియా అంచనాల ప్రకారం గత ఏడాది ఇండియాలో నెట్ఫ్లిక్స్కు 20 లక్షల మంది సబ్స్క్రయిబర్లున్నారు. గత ఏడాది సెప్టెంబర్ నాటికి ప్రపంచమంతా నెట్ఫ్లిక్స్కు 16 కోట్ల మంది సబ్స్క్రయిబ్ చేసుకున్నారు.
ఇండియా కంటెంట్కు ప్రపంచమంతా ఆదరణ
ఇండియా కంటెంట్ను ప్రపంచమంతా ఆదరిస్తోందని రీడ్ చెప్పారు. ఇండియాను దాటి గ్లోబల్ ఆడియన్స్, ఆ కంటెంట్ను చూస్తున్నారన్నారు. నెట్ఫ్లిక్స్లో ప్రసారమైన చిల్డ్రెన్స్ యానిమేటెడ్ షో ‘మైటీ లిటిల్ భీమ్’ను ప్రపంచ వ్యాప్తంగా 2.7 కోట్ల మంది చూశారని, ఇండియాకు సంబంధించిన కంటెంట్ను ఆదరిస్తున్నారనడానికి ఇదే ఉదాహరణ అని వివరించారు. ‘‘రాబోయే ఐదు, పదేళ్లు టెలివిజన్కు స్వర్ణయుగం. ఈ రంగంలో పెట్టుబడులు విపరీతంగా పెరుగుతున్నాయి. యాపిల్, అమెజాన్, డిస్నీ, వయాకామ్ వంటి కంపెనీలు ఇప్పటికే అందులోకి అడుగుపెట్టాయి. అందరూ ఇండియాపైనే దృష్టిపెట్టారు. బ్రిటన్, అమెరికాతో పాటు ఇండియా నుంచీ కంటెంట్ ఎక్కువగా వస్తోంది’’ అని అన్నారు.
ఢిల్లీ క్రైమ్.. సేకెర్డ్ గేమ్స్
2016లో ఇండియా సహా 190 దేశాల్లో నెట్ఫ్లిక్స్ లాంచ్ అయింది. అప్పటి నుంచి గత ఏడాది వరకు వచ్చిన ఇండియన్ కంటెంట్ తక్కువే. అయితే, పోయిన సంవత్సరం నెట్ఫ్లిక్స్లో ప్రసారం అయిన ‘సేకెర్డ్ గేమ్స్’ ఇంటర్నేషనల్ ఎమ్మీ అవార్డ్స్కు నామినేట్ అయింది. అండర్వరల్డ్ కథాంశంగా విక్రమ్ చంద్ర అనే ఇండియన్ అమెరికన్ రైటర్ రాసిన ‘సేకెర్డ్ గేమ్స్’ అనే అండర్నవల ఆధారంగా నెట్ఫ్లిక్స్ దానిని తెరకెక్కించింది. దానిని ప్రపంచమంతా హిట్ చేసింది. ఇక, 2012 ఢిల్లీ గ్యాంగ్ రేప్ ‘నిర్భయ’ స్టోరీ ఆధారంగా ‘ఢిల్లీ క్రైమ్’ అనే స్టోరీ కూడా నెట్ఫ్లిక్స్లో మంచి హిట్ అయింది. ఘటన జరిగిన తీరు, పోలీసుల దర్యాప్తుపై రిచీ మెహతా ఆ స్టోరీని డైరెక్ట్ చేశారు. అయితే, ఆ స్టోరీని తీయొద్దని కొందరు చెప్పినా, ఆర్టిస్టిక్ ఫ్రీడమ్తో దానిని ముందుకు తీసుకెళ్లామని రీడ్ తెలిపారు.
కంటెంట్ ఉంటే ఎంతపెట్టైనా చూస్తారు
అమెజాన్ ప్రైమ్, డిస్నీ హాట్స్టార్లాగే గత ఏడాది జులైలో నెట్ఫ్లిక్స్ కూడా ప్రత్యేకంగా ఇండియా కోసం ఓ మొబైల్ ఓన్లీ ప్లాన్ తీసుకొచ్చింది. రూ.199 ప్లాన్తో కొత్త సబ్స్క్రైబర్లకు అవకాశం ఇచ్చింది. ప్రస్తుతం నెట్ఫ్లిక్స్ బేసిక్ సర్వీస్కున్న చార్జీలతో పోలిస్తే చాలా తక్కువని కంపెనీ చెబుతోంది. మామూలు సబ్స్క్రిప్షన్ రేటు నెలకు రూ.500 అని చెబుతోంది. అయితే, అమెజాన్, హాట్స్టార్లు మాత్రం ఏడాది సర్వీస్కు రూ.999 చార్జ్ చేస్తున్నాయి. వాటితో పోలిస్తే మాత్రం నెట్ఫ్లిక్స్ కాస్ట్ కొంచెం ఎక్కువేనన్న వాదనలున్నాయి. కానీ, ఆ వాదనలను తోసిపుచ్చుతున్నారు రీడ్ హేస్టింగ్స్. కంటెంట్ ఉందనుకుంటే కస్టమర్లు ఎంతపెట్టైనా సబ్స్క్రయిబ్ చేసుకుని చూస్తారంటున్నారు. ‘‘మనం మంచి కంటెంట్ ఇస్తే, ఎంతైనా పెట్టేందుకు కస్టమర్లు రెడీగా ఉంటారు. అమెరికాలో కేబుల్ టెలివిజన్ కాస్ట్ దాదాపు 75 డాలర్లు (సుమారు రూ.5,400) ఉంటుంది. అదే ఇండియాలో జస్ట్ 3 నుంచి 5 డాలర్లే (రూ.200 నుంచి రూ.350) ఖర్చు అవుతుంది. ఆ లెక్కన ఇక్కడ అయ్యే ఖర్చు తక్కువే. మార్కెట్కు మాత్రం మంచి డిమాండ్ ఉంది. కాబట్టి రూ.199 అంటే నా దృష్టిలో తక్కువే’’ అని అన్నారు.
కంటెంట్ రెగ్యులేషన్లో అర్థం లేదు
కంటెంట్పై స్వీయ నియంత్రణ కోసం పాలసీలు రూపొందిస్తున్నామని రీడ్ హేస్టింగ్స్ చెప్పారు. ‘‘ప్రతి దేశానికి కంటెంట్పై ఏదో ఒక సమస్య ఉంటుంది. చాలా మంది యూట్యూబ్, నెట్ఫ్లిక్స్, అమెజాన్ వంటి సంస్థలు కచ్చితంగా ప్రసారంలో ప్రమాణాలు పాటించాల్సిందిగా సూచిస్తున్నారు. ఆ మాటల్లో అసలు అర్థం లేదు. టీవీల్లాగా ఆన్లైన్ స్ట్రీమింగ్ ప్రతి ఇంటికీ చేరదు. కాబట్టి సెల్ఫ్ రెగ్యులేషన్ అనేది అర్థం లేని విషయం’’ అని అన్నారు. సేకెర్డ్ గేమ్స్లోని కొన్ని సీన్లపై ఇటీవల ఇండియాలో అభ్యంతరాలు వ్యక్తమైన సంగతి తెలిసిందే. మాజీ ప్రధాని రాజీవ్ గాంధీని అవమానపరిచేలా సీన్లున్నాయంటూ కోర్టులో పిటిషన్ వేశారు. ఆ కేసు ఇంకా నడుస్తోంది. ఈ నేపథ్యంలోనే ఆయన ఈ కామెంట్ చేశారు. ఎంటర్టైన్మెంట్కు సంబంధించి ఏదో ఒక వివాదం రేగుతూనే ఉంటుందన్నారు.

