కొత్త ఆటోలు వస్తున్నయ్​...హైదరాబాద్​​లో కొత్త పర్మిట్లకు సర్కారు గ్రీన్​సిగ్నల్

కొత్త ఆటోలు  వస్తున్నయ్​...హైదరాబాద్​​లో కొత్త పర్మిట్లకు సర్కారు గ్రీన్​సిగ్నల్
  • రోడ్లపైకి రానున్న 65 వేల ఆటోలు
  • 40 వేల నాన్​ పెట్రోల్, డీజిల్ ఆటోలకు అనుమతి
  • మరో 25 వేల ఆటోలకు రెట్రోఫిట్టింగ్
  • ఆటోల సంఘాల డిమాండ్లతో జీవో 263 విడుదల

హైదరాబాద్​సిటీ, వెలుగు: గ్రేటర్ పరిధిలో కొత్త ఆటోలకు పర్మిట్లు ఇవ్వడానికి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్​ఇచ్చింది. చాలా కాలంగా ఆటో సంఘాల నుంచి వస్తున్న అభ్యర్థనల మేరకు అనుమతిస్తూ జీవో 263 జారీ చేసింది. కాలుష్యం తీవ్రంగా పెరుగుతున్న నేపథ్యంలో సిటీలో 2002 నుంచి కొత్త ఆటో పర్మిట్లపై నిషేధం కొనసాగుతోంది. అయినా కొన్ని ప్రత్యేక సందర్భాల్లో  ప్రభుత్వమే కొన్నివాహనాలకు అనుమతులు ఇవ్వగా,మరికొందరు ఇతరజిల్లాల నుంచి ఆటోలనుతీసుకొచ్చినగరంలో నడుపుకుంటున్నారు. 

 ఔటర్​ రింగ్​ రోడ్​ లోపల పెరుగుతున్న భారీ నిర్మాణాలు, కొత్త లేఅవుట్లు, వెంచర్లతో అందుకు తగ్గట్టుగా రవాణా అవసరాలు పెరుగుతున్నాయి. ఈ క్రమంలో ఇటీవల ఎలక్ట్రిక్​ఆటోలను ప్రోత్సహిస్తూ సర్కారు నిర్ణయం తీసుకుంది. పాత వాహనాలను స్క్రాప్​ చేసిన తర్వాతే కొత్త ఎలక్ట్రిక్ వాహనం కొనుగోలుకు ఆర్టీఏ అధికారులు అనుమతినిస్తూ వచ్చారు. 

అయితే ఇతర జిల్లాల్లో మాదిరిగానే హైదరాబాద్​లోనూ కొత్త ఆటోల కొనుగోలుకు పర్మిట్లు ఇవ్వాలని ఆటో సంఘాలు కొంతకాలంగా డిమాండ్​ చేస్తున్నాయి. వీరి అభ్యర్థనలను దృష్టిలో పెట్టుకొని తాజాగా 40 వేల వరకు కొత్త ఆటోలకు పర్మిట్లు ఇవ్వాలని సర్కారు నిర్ణయించింది. 

జీహెచ్ఎంసీతో పాటు, ఔటర్​రింగ్​రోడ్​వరకూ ఈ అనుమతులు వర్తిస్తాయని జీవోలో పేర్కొన్నారు.అంతేకాకుండా పాత పెట్రోల్, డీజిల్​వాహనాలను ఎలక్ట్రిక్,సీఎన్జీ,ఎల్పీజీలుగా మార్చుకునేందుకు 25వేల రెట్రోఫిట్టెడ్​ఎలక్ట్రిక్ ఆటోలకు అనుమతించనున్నారు. దీంతో రానున్న రోజుల్లో 65 వేల వాహనాలు సిటీ రోడ్లపైకి రానున్నాయి. 

ఒక్క వ్యక్తికి ఒకే పర్మిట్​

ఒక్క వ్యక్తికి ఒకే పర్మిట్ ఇవ్వాలని ప్రభుత్వం జీవోలో పేర్కొంది. కొత్త ఎలక్ట్రిక్ వాహనాలు 20 వేలు, కొత్త సీఎన్జీ వాహనాలు 10 వేలు, కొత్త ఎల్పీజీ వాహనాలకు 10 వేల వరకు పర్మిట్లు ఇవ్వనున్నారు. పాత ఆటోలకు ఎలక్ట్రిక్​ ఫిటింగ్​ చేసుకునేందుకు రెట్రోఫిట్టెడ్​ఎలక్ట్రిక్ వాహనాలుగా మరో 25 వేల ఆటోలకు అనుమతి ఇవ్వనున్నారు. 

పాత నిబంధన ప్రకారమే కాలుష్యం తగ్గించడానికి పెట్రోల్, డీజిల్​ వాహనాలను హైదరాబాద్​లో అనుమతించరు. అందులో భాగంగా ఎలక్ట్రిక్ ఆటోలు కొనుగోలు చేసే వారికి రెండేళ్ల పాటు అంటే 2026 నవంబరు వరకూ టాక్స్, రిజిస్ట్రేషన్​లో  రాయితీని  కాంగ్రెస్​ ప్రభుత్వం ప్రకటించింది. 

ప్రస్తుతం గ్రేటర్​పరిధిలో 1.20 లక్షల వరకూ ఆటోలు తిరుగుతున్నాయి. వీటిలో ఎలక్ట్రిక్​ వాహనాలు దాదాపు 20 వేలు ఉండగా, సీఎన్జీ 30 వేలు, ఎల్పీజీ మరో 25 వేల వరకు ఉన్నాయి. మిగిలినవన్నీ కూడా ఇతర జిల్లాల నుంచి  వచ్చి నగరంలో నడుస్తున్నవేనని అధికారులు తెలిపారు. 

65 వేల కుటుంబాలకు ఉపాధి

నగరంలో కొంతకాలంగా ఆటో రిక్షాలపై పరిమితి ఉంది.. అందువల్లే కొత్త పర్మిట్లు ఇవ్వలేదు.  ఆ పరిమితిని సడలిస్తూ జీహెచ్ఎంసీ, ఓఆర్ఆర్ లోపల పరిమిత సంఖ్యలో ఎలక్ట్రిక్, సీఎన్జీ, ఎల్పీజీ ఆటో రిక్షాలకు అనుమతి ఇస్తూ  జీవో నంబర్ 263 విడుదల చేశాం. సీఎం రేవంత్ రెడ్డి ఆలోచనలకు అనుగుణంగా కాలుష్యాన్ని తగ్గించడానికి ఈ నిర్ణయం ఎంతగానో ఉపయోగపడుతుంది. కొత్త ఆటోల పర్మిట్లతో నగరంలో కాలుష్యాన్ని తగ్గించడమే కాకుండా దాదాపు 65 వేల కుటుంబాలకు ఉపాధి అవకాశాలు లభించనున్నాయని - రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్​తెలిపారు.