
కాశీబుగ్గ, వెలుగు: భద్రకాళీ అమ్మవారికి రూ.కోటితో రథం తయారు చేయించడానికి ఆలయ పాలకమండలి తీర్మానించింది. ఆదివారం అమ్మవారి శాకాంబరి నవరాత్రి మహోత్సవాల ఏర్పాట్ల పై పాలక మండలి చైర్మన్ శివసుబ్రహ్మణ్యం, ఈవో శేషు భారతి ఆధ్వర్యంలో కొత్త పాలక మండలి సమావేశం జరిగింది. ఇందులో కంచి కామాక్షి అమ్మవారి రథాన్ని పోలిన రథాన్ని భద్రకాళీ అమ్మవారికి తయారుచేయించాలని తీర్మానించారు. మాడవీధులు నిర్మాణం పూర్తికానున్నందున అమ్మవారి వాహన సేవలు, రథ సేవ మాడవీధుల గుండానే జరుపనున్నారు.
రథం నిర్మాణానికి ప్రభుత్వ అనుమతులు ఇవ్వాలని దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ, వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డిని ధర్మకర్తల మండలి కోరిందని తెలిపారు. ఈ నెల 26 నుంచి వచ్చే నెల 10వ తేదీ వరకు శాకాంబరి నవరాత్రి మహోత్సవాల ఏర్పాట్లపై చర్చించారు. కార్యక్రమంలో వీరన్న, శ్రవణ్ కుమార్ రెడ్డి, పూర్ణచందర్, క్రాంతి, సతీశ్, రామేశ్వర్రావు, స్రవంతి, సుగుణ, ఆంజనేయులు, వెంకటేశ్వర్లు, శ్రీనివాస్ రావు, నర్సింహమూర్తి, ప్రధానార్చకులు భద్రకాళి శేషు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.