- సికింద్రాబాద్ను జిల్లా చేయాల్సిందే.. ఏదైనా ఒక జిల్లాకు పీవీ పేరు పెట్టాలి
- ఎన్నికలు రావడంతో గుంపుమేస్త్రీ, గుంటనక్క ఫోన్ ట్యాపింగ్ డ్రామా
- ఈ కేసులో నాలాంటి బాధితులకు
- న్యాయం జరుగుతుందన్న నమ్మకం లేదు
- జాగృతి ఇంకా పూర్తిస్థాయి రాజకీయ పార్టీగా మారలేదు
- మున్సిపల్ ఎన్నికల్లో ఇండిపెండెంట్లకు మద్దతు ఇస్తామని వెల్లడి
హైదరాబాద్, వెలుగు: సికింద్రాబాద్ జిల్లా కోసం కేటీఆర్కొత్త డ్రామాలడుతున్నారని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత అన్నారు. ‘‘బీఆర్ఎస్హయాంలో సికింద్రాబాద్ జిల్లా కావాలని అడిగినోళ్లను అణచివేశారు. అలాంటిది ఇప్పుడు సికింద్రాబాద్ జిల్లా కావాలని కేటీఆర్ అడగడం విడ్డూరంగా ఉంది” అని విమర్శించారు. బుధవారం తెలంగాణ జాగృతి ఆఫీసులో ఉద్యమకారుడు, మాజీ మంత్రి ముచ్చర్ల సత్యనారాయణ జయంతి నిర్వహించారు.
ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ.. జిల్లాల పునర్విభజన ఇప్పుడు జరగదని కేంద్రం గతంలోనే తేల్చి చెప్పిందని పేర్కొన్నారు. జిల్లాల పునర్విభజన ఎప్పుడు జరిగినా సికింద్రాబాద్ను జిల్లా చేయాల్సిందేనని, కొత్త జిల్లాల్లో ఏదో ఒక దానికి పీవీ నర్సింహారావు పేరు పెట్టాలని డిమాండ్చేశారు. ‘‘మున్సిపల్ఎన్నికలు రావడంతో మళ్లీ ఫోన్ ట్యాపింగ్డ్రామా మొదలుపెట్టారు. గుంపు మేస్త్రీ, గుంట నక్క ఆడుతున్న డ్రామా ఇది. బీసీ రిజర్వేషన్లను ఎవరూ అడగకుండా ఉండాలనే అటెన్షన్డైవర్షన్కు తెరదీశారు. గుంపు మేస్త్రీ, గుంట నక్క కలిసే ఉన్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో నాలాంటి బాధితులకు న్యాయం జరుగుతుందన్న నమ్మకం లేదు. ఇప్పుడు చేస్తున్న విచారణతో ఒరిగేదేమీ లేదు” అని అన్నారు.
బీసీలను మోసం చేస్తన్నరు..
బీసీలను కాంగ్రెస్, బీఆర్ఎస్ మోసం చేస్తున్నాయని కవిత మండిపడ్డారు. బీసీ రిజర్వేషన్లు తేలకుండానే మున్సిపల్ఎన్నికలు ఎలా నిర్వహిస్తారని ప్రశ్నించారు. మున్సిపల్ ఎన్నికలకు తొందరేమీ లేదని, 42% రిజర్వేషన్లు ఇచ్చాకే ముందుకెళ్లాలని డిమాండ్ చేశారు. ‘‘కులగణనలో బీసీలకు కాంగ్రెస్ తీవ్ర అన్యాయం చేసింది. బీసీ కులాల లెక్కను తక్కువ చేసి చూపించింది. కేంద్రం చేయబోయే కుల గణన ద్వారా కాంగ్రెస్చేసిన మోసాన్ని బయటపెట్టే అవకాశం వచ్చింది. జాగృతి తరఫున మేం ప్రతి కులం వివరాలనూ సేకరిస్తాం. బీసీలకు అన్యాయం జరగకుండా నివేదిక సిద్ధం చేస్తాం. దీనిపై త్వరలోనే రౌండ్ టేబుల్ సమావేశం కూడా నిర్వహిస్తాం” అని తెలిపారు.
ఉద్యమకారులను గుర్తించి గౌరవిస్తం..
ముచ్చర్ల సత్యనారాయణ వంటి ఉద్యమకారుల గురించి కొత్త తరం నాయకులు తెలుసుకోవాల్సిన అవసరం ఉందని కవిత అన్నారు. తెలంగాణ ఫస్ట్ అన్నదే తమ నినాదమని, తెలంగాణకు మంచి చేసినోళ్లు ఏ పార్టీలో ఉన్నా.. వారిని స్ఫూర్తిని తీసుకుంటామని చెప్పారు. ‘‘గత ప్రభుత్వంలో ముచ్చర్ల వంటి ఎంతోమంది ఉద్యమకారులను విస్మరించారు. తెలంగాణ వచ్చి ఇన్నేండ్లవుతున్నా ట్యాంక్బండ్పై ఇప్పటికీ మనవాళ్ల విగ్రహాలు లేవు. ఆంధ్రోళ్ల విగ్రహాలు తీసేయమనడం లేదు.
అవసరమైనప్పుడు, సందర్భం వచ్చినప్పుడు తప్పకుండా తీసేద్దాం. అప్పటివరకు మన తెలంగాణోళ్ల విగ్రహాలను ట్యాంక్బండ్పై పెట్టాలి” అని డిమాండ్ చేశారు. అమరజ్యోతికి అవినీతి మరకలు అంటించారని చెప్పి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్.. ఇప్పటి వరకు దానిపై విచారణ జరపడం లేదన్నారు. కనీసం తెలంగాణ ఉద్యమకారుల జయంతి, వర్ధంతులు జరపడం లేదన్నారు. తెలంగాణ ఉద్యమంలో గుర్తించని హీరోలు ఎందరో ఉన్నారని, వారి చరిత్రనూ భవిష్యత్ తరాలకు తెలిసేలా ప్రయత్నిస్తామని చెప్పారు.
ఏదో ఒక రోజు అధికారం మాదే
యువత మున్సిపల్ఎన్నికల్లో పోటీ చేయాలని కవిత పిలుపునిచ్చారు. ‘‘జాగృతి ఇంకా పూర్తిస్థాయి రాజకీయ పార్టీగా మారలేదు. కానీ బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, యువత, మహిళలు ఎవరైనా మమ్మల్ని సంప్రదిస్తే వారికి మద్దతిస్తాం. అవసరమైతే జాగృతి తరఫున నేనే వారికి ప్రచారం చేస్తాను” అని హామీ ఇచ్చారు. రాజకీయ ప్రక్రియ ఎలా ఉంటుందో తెలుసుకునేందుకు ఈ ఎన్నికలు ఉపయోగపడతాయన్నారు. యువత, మహిళలు, బీసీ, ఎస్సీ, ఎస్టీలు రాజకీయాల్లోకి రావాలన్నారు. తెలంగాణ జాగృతి ఎప్పుడో ఒకప్పుడు రాష్ట్రంలో అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు.
