- బడులు, అంగన్ వాడీల్లో క్లీనింగ్ బాధ్యత
- పనులైనంక యాప్లో ఫొటో పంపాలే: పంచాయతీరాజ్ అర్డర్
- కొత్త పనులేందంటూ కార్యదర్శుల ఫైర్
హైదరాబాద్, వెలుగు: పల్లెల్లోని పబ్లిక్ ఇనిస్టిట్యూషన్లలో శానిటేషన్ బాధ్యతలను పంచాయతీ సెక్రటరీలకు అప్పగిస్తూ పంచాయతీరాజ్ కమిషనర్ ఇటీవల ఆదేశాలిచ్చారు. బడులు, అంగన్ వాడీలు, కమ్యూనిటీ హాళ్లు, హెల్త్ సెంటర్లల్లో క్లీనింగ్ పనులను పర్యవేక్షించాలన్నారు. శానిటేషన్ పూర్తయ్యాక యాప్ లో ఫొటో అప్ లోడ్ చేయాలని.. హెచ్ ఎం, వర్కర్ తో సంతకం చేయించి రిజిస్టర్ మెయింటెయిన్ చేయాలని పేర్కొన్నారు. ఈ నిర్ణయంపై కార్యదర్శులు మండిపడుతున్నారు. ఇప్పటికే పని ఒత్తడితో సతమతమవుతున్నామని, మళ్లా కొత్త బాధ్యతలేందంటూ ఫైర్ అవుతున్నారు. కరోనాకు ముందు వరకు సర్కార్ బడుల్లో క్లీనింగ్ పనులు చేసేందుకు స్కావెంజర్లు ఉండేవారు. వారికి నెలకు రూ.2,500 జీతం ఇచ్చేవారు. అయితే కరోనా టైమ్ లో స్కావెంజర్లను సర్కార్ తొలగించింది. ఆ పనులను పంచాయతీ కార్మికులకు అప్పగించింది. రెండేండ్ల నుంచి వాళ్లే స్కూళ్లను క్లీన్ చేస్తున్నారు. అయితే ఇప్పుడు తాజాగా క్లీనింగ్ పర్యవేక్షణ బాధ్యతలను సెక్రటరీలకు అప్పగించింది. కాగా, ‘‘కార్మికుల కొరత ఉండడంతో మల్టీపర్పస్ వర్కర్లను నియమించుకోవాలని అధికారులు చెప్పారు. వారికి నెలకు రూ.2,500 ఇవ్వాలని సూచించారు. అయితే ఆ జీతాన్ని ప్రభుత్వ ఖర్చులో చూపించొద్దని చెప్పారు” అని సెక్రటరీలు చెబుతున్నారు.
ఇప్పటికే భారమైతంది..
స్కూళ్లు సరిగా క్లీన్ చేయటం లేదంటూ టీచర్లు వంకలు పెడతరు. వాళ్లు రిజిస్టర్లో సంతకం చేయకపోతే మాకు షోకాజ్ నోటీసులిస్తరు. ఇప్పటికే ఊర్లల్ల క్లీనింగ్ బాధ్యతలతో మాపై భారం పెరుగుతోంది. మళ్లా కొత్త పనులెట్ల చేసుడు.
- ఆదిలాబాద్కు చెందిన సెక్రటరీ