హైదరాబాద్ బండ్లగూడలో జరిగిన రోడ్డు ప్రమాదం కేసులో మరో ట్విస్ట్ తీసుకుంది. నిర్లక్ష్యంగా కారు నడిపి రెండు ప్రాణాల్ని బలిగొన్న బద్రుద్దీన్ ఖాదిరి దగ్గర అసలు డ్రైవింగ్ లైసెన్స్ లేదని పోలీసులు గుర్తించారు. ఇక ప్రమాదానికి కారణమైన హోండా సివిక్ కారును హమ్మద్ ఇయాజ్ అన్ లైన్ లో విక్రయించాడు.
హమ్మద్ ఇయాజ్ విక్రయించిన కారును ఓఎల్ఎక్స్ లో మరో వ్యక్తి కొనుగోలు చేశాడు. అయితే.. ఇప్పటివరకూ ఆ హోండా సివిక్కారు పేపర్లు, అడ్రస్ మారలేదు. దీంతో ఇయాజ్ను సైతం పోలీసులు ప్రశ్నిస్తున్నారు. మొత్తం కారులో ప్రయాణిస్తున్న నలుగురిని ఇప్పటికే పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.
హైదరాబాద్ శివారు బండ్లగూడలో కారు బీభత్సం సృష్టించింది. హైదర్ షాకోట్ ప్రధాన రహదారిపై ఆర్మీ స్కూలు వద్ద ఈ రోడ్డు ప్రమాదం జరిగింది. మార్నింగ్ వాక్కు వెళ్తున్న నలుగురిని బండ్లగూడ జాగీర్ సన్ సిటీ వద్దహోండా సివిక్ ఎర్ర కలర్ కారు ఢీకొట్టింది.
ఈ ప్రమాదంలో తల్లీకుమార్తెలు మృతిచెందగా.. మృతులను అనురాధ(38), మమత(26)గా గుర్తించారు. మరో మహిళ మాళవిక తీవ్రంగా గాయపడ్డారు. బాధితులది బండ్లగూడ లక్ష్మీనగర్. గాయపడిన మాళవికను మెహిదీపట్నంలోని ఓ ఆస్పత్రిలో చేర్చించి.. చికిత్స అందిస్తున్నారు.