- లిక్కర్ సేల్స్తో 4 రోజుల్లోనే ఎక్సైజ్ శాఖకు భారీగా ఆదాయం
- డిసెంబర్లో మద్యం అమ్మకాలు ఆల్ టైం రికార్డ్
- ఈ నెలలో కలిసి వచ్చిన సర్పంచ్ ఎన్నికలు
- కొత్త మద్యం పాలసీ కావడంతో షాపుల్లో ఫుల్స్టాక్
- తెచ్చిన స్టాక్ మొత్తం అయిపోవడంతో వ్యాపారుల్లో జోష్
హైదరాబాద్, వెలుగు:రాష్ట్రంలో మద్యం అమ్మకాలు ఆల్ టైం రికార్డును సృష్టించాయి. ఒక్క డిసెంబర్ నెలలోనే రూ. 5 వేల కోట్ల సేల్స్ మార్కును దాటేసింది. సాధారణంగా పండుగలు, ప్రత్యేక రోజుల్లో అమ్మకాలు పెరగడం సహజమే. అయితే ఈ స్థాయిలో సేల్స్ ఎప్పుడూ కాలేదని ఎక్సైజ్ అధికారులు పేర్కొంటున్నారు.
ఒకవైపు న్యూ ఇయర్ కిక్ కాగా.. ఇంకోవైపు సర్పంచ్ ఎన్నికలు కలిసి వచ్చాయి. కొత్త మద్యం పాలసీ కూడా డిసెంబర్లోనే మొదలు కావడంతో డిపోల నుంచి ఎప్పటికప్పుడు స్టాక్ బయటకు వెళ్లడంతో ఎక్సైజ్ శాఖకు ఈ ఏడాది.. అదిరిపోయే కిక్తో ముగింపు పలికింది. అంతకు ముందు మద్యం పాలసీ మొదలైన 2023 డిసెంబర్లో రూ.4,291 కోట్లు వచ్చాయి.
డిసెంబర్ చివరి నాలుగు రోజుల్లోనే లిక్కర్ సేల్స్ జోరందుకున్నాయని, ఈ రోజుల్లోనే సుమారు రూ. 1,230 కోట్ల అమ్మకాలు జరిగాయని ఎక్సైజ్ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. డిసెంబర్ 27 నుంచి 31 రాత్రి వరకు వైన్ షాపులకు చేరిన మద్యం బాటిళ్ల విలువను చూస్తే ఈ విషయం స్పష్టమవుతున్నది.
క్షణం తీరిక లేకుండా కౌంటర్లు నడవడంతో కోట్ల రూపాయల వ్యాపారం జరిగింది. పాత సంవత్సరానికి గుడ్ బై చెబుతూ, కొత్త సంవత్సరానికి స్వాగతం పలికేందుకు యువత, మద్యంప్రియులు పెద్ద ఎత్తున పార్టీలు చేసుకోవడంతో బీర్లు, విస్కీలు, ప్రీమియం బ్రాండ్ల సేల్స్ ఆకాశాన్ని తాకాయి. 28న రూ.182 కోట్లు, 29న రూ.282 కోట్లు, 30న రూ.375 కోట్లు, 31న రూ.400 కోట్ల పైచిలుకు విలువైన మద్యం డిపోల నుంచి వైన్ షాప్లకు చేరింది. ప్రభుత్వం అర్ధరాత్రి దాకా మద్యం అమ్మకాలకు అనుమతులతోపాటు 31 రాత్రి ప్రత్యేక ఈవెంట్లకు పర్మిషన్ ఇవ్వడంతో సేల్స్ అమాంతం పెరిగాయి.
ఖజానా గలగల ఈ సారి డిసెంబర్ నెలలో అమ్మకాలు ఈ స్థాయిలో పెరగడానికి న్యూ ఇయర్తోపాటు రాష్ట్రవ్యాప్తంగా జరిగిన సర్పంచ్ ఎన్నికలు కారణమయ్యాయి. పల్లెల్లో పోరు రసవత్తరంగా సాగడంతో అభ్యర్థులు ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు మద్యాన్ని నీళ్లలా ఖర్చు చేయడంతో సేల్స్ పెరిగిపోయాయి. నామినేషన్ల ఘట్టం నుంచి ఫలితాలు వచ్చే వరకు గ్రామాల్లో విందులు, వినోదాలు జోరుగా సాగడం, దావత్ల పేరుతో భారీగా మద్యం కొనుగోలు చేయడంతో మద్యం డిపోలు వెంటవెంటనే ఖాళీ అయ్యాయి.
రాజకీయ వేడికి మందు కిక్కు తోడవ్వడంతో గ్రామీణ ప్రాంతాల్లోని మద్యం దుకాణాల్లో డిసెంబర్ నెల మొత్తం పండుగ వాతావరణమే కనిపించింది. ఇది ప్రభుత్వ ఆదాయాన్ని రికార్డుస్థాయికి చేర్చింది. మరోవైపు ష్ట్రంలో కొత్త మద్యం విధానం ఇదే నెలలో అమల్లోకి రావడం కూడా ఈ రికార్డు స్థాయి అమ్మకాలకు మరో బలమైన కారణంగా నిలిచింది. కొత్తగా లైసెన్సులు దక్కించుకున్న వ్యాపారులు.. షాపుల్లో ఎలాంటి కొరత రాకూడదనే ఉద్దేశంతో డిపోల నుంచి పరిమితికి మించి సరుకును లిఫ్ట్ చేశారు. తెచ్చిన స్టాక్ ఎప్పటికప్పుడు అయిపోవడంతో జోష్ మీదున్నారు.
రోజువారీగా వచ్చిన ఆదాయం
- డిసెంబర్ 31 రూ.400 కోట్లు
- డిసెంబర్ 30 రూ.375 కోట్లు
- డిసెంబర్ 29 రూ.282 కోట్లు
- డిసెంబర్ 28 రూ.182 కోట్లు
