- తొలి రౌండ్ లోనే ఓటమిపాలైన నెహ్వాల్
- ప్రణయ్ , సాయి బోణీ
ఆక్లాండ్: ఇండియా ఏస్ షట్లర్ సైనా నెహ్వాల్కు షాక్ తగిలింది. న్యూజిలాండ్ ఓపెన్లో టైటిల్ లక్ష్యంగా బరిలోకి దిగిన సైనా.. తొలి రౌండ్లో అనామక ప్లేయర్ చేతిలో ఓటమిపాలై తీవ్రంగా నిరాశ పరిచింది. యువ షట్లర్ లక్ష్యసేన్, సిక్కిరెడ్డి–అశ్విని పొన్నప్ప జంట ఫస్ట్ రౌండ్లోనే ఓడిపోగా.. సాయిప్రణీత్, హెచ్ఎస్ ప్రణయ్ శుభారంభం చేశారు. కొంతకాలంగా సరైన విజయాలు లేక సతమతమవుతున్న ప్రపంచ తొమ్మిదో ర్యాంకర్ అయినా సైనాకు 212 ర్యాంకర్ చైనా ప్లేయర్ వాంగ్ జియి దిమ్మతిరిగే షాకిచ్చింది.
బుధవారం జరిగిన మహిళల సింగిల్స్ తొలి రౌండ్లో రెండో సీడ్ సైనా 16–21, 23–21, 4–21తో 19 ఏళ్ల వాంగ్ చేతిలో పరాజయం పాలైంది. 67 నిమిషాల పాటు సాగిన ఈ మ్యాచ్లో తొలి గేమ్ ఆరంభంలోనే 0–4తో వెనుకబడ్డ సైనా ప్రత్యర్థిని అందుకోలేకపోయింది. రెండో గేమ్లోనూ ప్రత్యర్థి నుంచి నెహ్వాల్కు గట్టి పోటీ ఎదురైంది. ఆఖర్లో మెరుగ్గా ఆడిన ఇండియా షట్లర్ గేమ్ నెగ్గి మ్యాచ్లో నిలిచింది. కానీ, మూడో గేమ్లో సైనా పూర్తిగా చేతులెత్తేసింది. వరుసగా 8 పాయింట్లు గెలిచిన వాంగ్ మ్యాచ్ను ఖాతాలో వేసుకుంది.
మరో మ్యాచ్లో అరుణ ప్రభుదేశాయ్ 9–21, 10–21తో ఆరో సీడ్ లీ జురుయ్ (చైనా) చేతిలో ఓడిపోయింది. డబుల్స్ తొలి రౌండ్లో సిక్కిరెడ్డి–అశ్విని పొన్నప్ప జంట 14–21, 23–21, 14–21తో చాంగ్ చింగ్–చింగ్ టున్ (చైనీస్ తైపీ) జంట చేతిలో పరాజయం పాలైంది. పురుషుల సింగిల్స్లో సాయి ప్రణీత్ 21–17, 19–21, 21–15తో సహచర షట్లర్ శుభాంకర్ డేపై గెలిచాడు. మరో మ్యాచ్లో ప్రణయ్ 21–15, 21–14తో లొ కియన్ (సింగపూర్)పై నెగ్గి రెండో రౌండ్కు చేరుకున్నాడు. కానీ, లక్ష్యసేన్ 21–15, 18–21, 10–21తో వాంగ్ జు వీ (చైనీస్ తైపీ) చేతిలో ఓడిపోయాడు. డబుల్స్లో సుమీత్రెడ్డి–మను అత్రి జంట 21–7, 21–10తో జొషువా ఫెంగ్–జాక్ జియాంగ్ (న్యూజిలాండ్) జోడీని చిత్తు చేసి బోణీ కొట్టింది.