- ఏపీ నంద్యాల జిల్లా నల్లగట్ల వద్ద యాక్సిడెంట్
- లారీని వెనుకనుంచి ఢీకొట్టిన కారు
- ఒకే కుటుంబంలో నలుగురు దుర్మరణం
అల్వాల్, వెలుగు: పెళ్లికి వేసిన పందిరి ఇంకా తీయనేలేదు.. ఆ ఇంటికి కట్టిన తోరణాలు ఇంకా వాడనేలేదు.. కాళ్ల పారాణి ఆరనే లేదు.. ఇంతలోనే ఆ ఇంట తీరని విషాదం నెలకొన్నది. పెళ్లి జరిగి వారం గడవకముందే ఆ కుటుంబాన్ని రోడ్డు ప్రమాదం రూపంలో మృత్యువు వెంటాడింది. ఈ ఘటనలో నవదంపతులుసహా అబ్బాయి తల్లిదండ్రులు, వరుడి స్నేహితుడు (డ్రైవర్) మృతి చెందారు. ఏపీలోని నంద్యాల జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో హైదరాబాద్ అల్వాల్ వెస్ట్ వెంకటాపురానికి చెందిన కుటుంబం మొత్తం ప్రాణాలు కోల్పోవడంతో విషాదఛాయలు అలుముకున్నాయి.
ఆగి ఉన్న లారీని ఢీ కొట్టిన కారు
మేడ్చల్ జిల్లా శామీర్పేట మండలం అలియాబాద్ గ్రామానికి చెందిన మంత్రి రవీందర్ కుమారుడి వివాహం ఫిబ్రవరి 29న తెనాలిలో జరిగింది. ఈ నెల 3న మేడ్చల్ జిల్లా శామీర్పేటలోని తూముకుంట సమ్మర్ గ్రీన్ రిసార్ట్లో రిసెప్షన్ నిర్వహించారు. ఈ నెల 4న నూతన దంపతులను తీసుకుని వెంకన్న దర్శనం కోసం తిరుమలకు వెళ్లారు. దర్శనం అనంతరం తిరిగి వస్తుండగా ఆంధ్రప్రదేశ్లోని నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ మండలం నల్లగట్ల వద్ద ఆగి ఉన్న లారీని వారి కారు వెనుకనుంచి ఢీ కొట్టింది.
ఈ ఘటనలో నూతన వధూవరులు బాలకిరణ్ (28), కావ్య (24), వరుడి తల్లిదండ్రులు లక్ష్మి (50), రవీందర్(59), కారు డ్రైవర్ అశోక్ (29) మృతి చెందినట్టు పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించామని వెల్లడించారు. మృతదేహాలను పోస్ట్మార్టం నిమిత్తం ప్రభుత్వ దవాఖానకు తరలించామని పేర్కొన్నారు. కాగా, కుటుంబం అంతా రోడ్డు ప్రమాదంలో మృతిచెందడంతో అల్వాల్ వెస్ట్ వెంకటాపురంలో విషాదఛాయలు అలుముకున్నాయి.