రోడ్డు ప్రమాదంలో నవదంపతుల మృతి

రోడ్డు ప్రమాదంలో నవదంపతుల మృతి
  •  ఏపీ నంద్యాల జిల్లా నల్లగట్ల వద్ద  యాక్సిడెంట్​
  • లారీని వెనుకనుంచి ఢీకొట్టిన కారు
  • ఒకే కుటుంబంలో నలుగురు దుర్మరణం

అల్వాల్, వెలుగు: పెళ్లికి వేసిన పందిరి ఇంకా తీయనేలేదు.. ఆ ఇంటికి కట్టిన తోరణాలు ఇంకా వాడనేలేదు.. కాళ్ల పారాణి ఆరనే లేదు.. ఇంతలోనే ఆ ఇంట తీరని విషాదం నెలకొన్నది. పెళ్లి జరిగి వారం గడవకముందే ఆ కుటుంబాన్ని రోడ్డు ప్రమాదం రూపంలో మృత్యువు వెంటాడింది. ఈ ఘటనలో నవదంపతులుసహా అబ్బాయి తల్లిదండ్రులు, వరుడి స్నేహితుడు (డ్రైవర్​) మృతి చెందారు. ఏపీలోని నంద్యాల జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో హైదరాబాద్‌‌ అల్వాల్ వెస్ట్ వెంకటాపురానికి చెందిన కుటుంబం మొత్తం ప్రాణాలు కోల్పోవడంతో విషాదఛాయలు అలుముకున్నాయి.   

ఆగి ఉన్న లారీని ఢీ కొట్టిన కారు

మేడ్చల్ జిల్లా శామీర్​పేట మండలం అలియాబాద్ గ్రామానికి చెందిన మంత్రి రవీందర్ కుమారుడి వివాహం ఫిబ్రవరి 29న తెనాలిలో జరిగింది. ఈ నెల 3న మేడ్చల్ జిల్లా శామీర్‌‌పేటలోని తూముకుంట సమ్మర్ గ్రీన్ రిసార్ట్​లో రిసెప్షన్​ నిర్వహించారు. ఈ నెల 4న నూతన దంపతులను తీసుకుని వెంకన్న దర్శనం కోసం తిరుమలకు వెళ్లారు. దర్శనం అనంతరం తిరిగి వస్తుండగా ఆంధ్రప్రదేశ్​లోని  నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ మండలం నల్లగట్ల వద్ద ఆగి ఉన్న లారీని వారి కారు వెనుకనుంచి ఢీ కొట్టింది. 

ఈ ఘటనలో నూతన వధూవరులు బాలకిరణ్ (28), కావ్య (24), వరుడి తల్లిదండ్రులు లక్ష్మి (50), రవీందర్(59),  కారు డ్రైవర్ అశోక్ (29) మృతి చెందినట్టు పోలీసులు తెలిపారు.  ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించామని వెల్లడించారు. మృతదేహాలను పోస్ట్‌‌మార్టం నిమిత్తం ప్రభుత్వ దవాఖానకు తరలించామని  పేర్కొన్నారు. కాగా, కుటుంబం అంతా రోడ్డు ప్రమాదంలో మృతిచెందడంతో అల్వాల్ వెస్ట్ వెంకటాపురంలో విషాదఛాయలు అలుముకున్నాయి.