ఏపీ, తెలంగాణ మధ్య గత కొన్ని రోజులుగా వివాదం రేపుతున్న పోతిరెడ్డిపాడు రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ విస్తరణకు బ్రేక్ పడింది. పోతిరెడ్డిపాడు విస్తరణ, సంగమేశ్వరం ఎత్తిపోతలపై స్టే విధించింది నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్. ప్రాజెక్టు అధ్యయనానికి 4 శాఖల సమన్వయంతో కేంద్ర కమిటీ ఏర్పాటు చేసింది. కమిటీ సభ్యులుగా కృష్ణా రివర్ మేనేజ్ మెంట్ బోర్డ్, కేంద్ర పర్యావరణ, కాలుష్య నియంత్రణ మండలి, హైదరాబాద్ ఐఐటీ నిపుణులను సభ్యులుగా నియమించింది. రెండు నెలల్లో కమిటీ స్టడీ చేసి నివేదిక ఇవ్వాలని చెప్పింది. తదుపరి ఆదేశాలిచ్చే వరకు పనులు చేయొద్దని ఏపీని ఆదేశించింది ట్రిబ్యునల్.
నారాయణ పేట జిల్లాకు చెందిన గవినోళ్ల శ్రీనివాస్ అనే వ్యక్తి ఎన్జీటీలో పిటిషన్ వేశారు. పోతిరెడ్డి పాడుతో తెలంగాణలో తాగు,సాగు నీటికి ఇబ్బందులు తలెత్తుతాయని పిటిషనర్ తెలిపారు. జస్టిస్ రామకృష్ణన్ నేతృత్వంలోని బెంచ్ విచారించి విస్తరణ పనులపై స్టే విధించింది.