నిర్మల్, వెలుగు: ప్రజాపాలన -ప్రగతి ప్రణాళిక కార్యక్రమాన్ని పకడ్బందీగా అమలుచేసి గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో ప్రగతి సాధించాలని ఎమ్మెల్యేలు ఏలేటి మహేశ్వర్ రెడ్డి, వెడ్మ బొజ్జు, రామారావు పటేల్ పేర్కొన్నారు. కలెక్టర్ అభిలాష అభినవ్ ఆధ్వర్యంలో గురువారం నిర్మల్ జిల్లాలో సర్పంచులు, మున్సిపల్ కౌన్సిలర్లకు అవగాహన సదస్సు నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు, కార్యక్రమాలు క్షేత్రస్థాయిలో ప్రజలకు చేరాలనే ఉద్దేశంతో 99 రోజుల ప్రత్యేక ప్రణాళికను ప్రారంభించిందని తెలిపారు. ప్రజాప్రతినిధులు నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉండాలని నిర్మల్ ఎమ్మెల్యే ఏలేటి మహే శ్వర్ రెడ్డి తెలిపారు.
అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పని చేయాలని ముధోల్ ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ సూచించారు. ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ మాట్లాడుతూ గ్రామాల అభివృద్ధిలో సర్పంచులదే కీలకపాత్ర అన్నారు. ప్రజా ప్రతినిధులు ప్రభుత్వానికి ప్రజలకు మధ్య అనుసంధానకర్తలుగా వ్యవహరించాలని సూచించారు. అనంతరం ప్రజాప్రతినిధులను సన్మానించారు. కార్యక్రమంలో అడిషనల్కలెక్టర్లు వెంకటేశ్వర్లు, కిషోర్ కుమార్, బైంసా సబ్ కలెక్టర్ అజ్మీరా సంకేత్ కుమార్, ఆర్డీఓ రత్న కల్యాణి, నిర్మల్ మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ లు అప్పాల కావ్య, అప్పాల గణేశ్ చక్రవర్తి, భైంసా మున్సిపల్ చైర్మన్ దత్తాత్రి, జిల్లా గ్రంథాల సంస్థ చైర్మన్ సయ్యద్ అర్జుమంద్ అలీ, డీఎల్ఎస్ఎ సెక్రటరీ రాధిక, సర్పంచులు, మున్సిపల్ కౌన్సిలర్లు పాల్గొన్నారు.
