హ్యాట్సాఫ్ నిర్మల: బాల్య వివాహాన్ని ఎదురించింది.. ఇంటర్ ఫలితాల్లో టాపర్ గా నిలిచింది

హ్యాట్సాఫ్ నిర్మల: బాల్య వివాహాన్ని ఎదురించింది.. ఇంటర్ ఫలితాల్లో టాపర్ గా నిలిచింది

ఆర్థిక ఇబ్బందులతో తల్లిదండ్రులు బాల్య వివాహం చేయాలని అనుకుంటే, వారిని ఎదురించి తన కలను సాకారం చేసుకుంది ఒక అమ్మాయి. కర్నూలు జిల్లా ఆదోని మండలంలోని పెద్దహరివనం అనే గ్రామానికి చెందిన నిర్మల పదవ తరగతిలో 537మార్కులతో పాస్ అయ్యింది. ఆ తర్వాత ఇంటర్ చదవాలన్న ఆమె కలకు తల్లిదండ్రులు అడ్డుపడ్డారు. అప్పటికే ముగ్గురు కూతుళ్ళకు పెళ్లిళ్లు చేసిన నిర్మల తల్లిదండ్రులు ఆర్థిక ఇబ్బందులు తట్టుకోలేక నిర్మలను కూడా చదువు మాన్పించి బాల్య వివాహం చేయాలని భావించారు.

అయితే, బాల్య వివాహం ఇష్టంలేని నిర్మల, ఎమ్మెల్యే సాయిప్రసాద్ రెడ్డిని కలిసి తన గోడు చెప్పుకుంది. నిర్మల కధ విని చాలించిన ఆయన వెంటనే కలెక్టర్ తో మాట్లాడి ఆమె వివాహాన్ని ఆపించేసి, నిర్మలను కస్తూరిభా గాంధీ బాలికల కళాశాలలో చేర్పించారు. ఆ తర్వాత పట్టుదలతో చదివి ఇంటర్లో 440మార్కులకు గాను 421 మార్కులు సాధించి టాపర్ గా నిలిచింది.

ఈ నేపథ్యంలో మీడియాతో మాట్లాడిన నిర్మల ఐపీఎస్ ఆఫీసర్ అయ్యి బాల్య వివాహాలను అడ్డుకొని, తనలాంటి వారికి సాయపడాలన్నది తన ఆశయమని చెప్పింది. ఈ సందర్బంగా ఎమ్మెల్యే సాయిప్రసాద రెడ్డి మాట్లాడుతూ నిర్మల విజయం మహిళా సాధికారత కోసం ప్రభుత్వం చేస్తున్న కృషికి నిదర్శనం అని అన్నారు. భవిష్యత్తులో నిర్మల కలను సాకారం చేసేందుకు తమ వంతు సాయం తప్పకుండా ఉంటుందని భరోసా ఇచ్చారు.