కనీస ఆదాయ పథకం అమలు అసాధ్యం : నీతి ఆయోగ్‌

కనీస ఆదాయ పథకం అమలు అసాధ్యం : నీతి ఆయోగ్‌

పనిచేయకుండా ఎవరికైనా భారీగా నగదు బదిలీ చేయడం ఆర్థిక క్రమశిక్షణా రాహిత్యానికి దారితీస్తుందని తెలిపింది నీతి ఆయోగ్.  ఈ పధకం ఎన్నడూ అమలుకు నోచుకోదని చెప్పారు నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ రాజీవ్ కుమార్. తాము అధికారంలోకి వస్తే దేశంలోని ఐదు కోట్ల పేద కుటుంబాలకు వారి బ్యాంకు ఖాతాల్లో ఏటా రూ 72 వేలు జమ చేస్తామని కాంగ్రెస్‌ చీఫ్‌ రాహుల్‌ గాంధీ చేసిన ప్రకటనపై ..రాజీవ్ కుమార్ ట్విట్టర్ ద్వారా స్పందించారు. ఈ పధకానికి బడ్జెట్‌లో 13 శాతం నిధులు అవసరమవుతాయని, దీని అమలు అసాధ్యమని చెప్పారు.

GDP లో రెండు శాతం, బడ్జెట్‌లో 13 శాతం కనీస ఆదాయ హామీ పధకానికి ఖర్చవుతాయని, ఇంతటి వ్యయంతో వీటిని అమలు చేస్తే ప్రజల వాస్తవ అవసరాలు మరుగునపడతాయని చెప్పారు.  కాంగ్రెస్‌ పార్టీ 1971లో గరీబీ హఠావో, 2008లో ఒన్‌ ర్యాంక్‌ ఒన్‌ పెన్షన్‌, 2014లో ఆహార భద్రత నినాదాలతో ఎన్నికల సమరాంగణంలో నిలిచినా.. వాటి అమలు సాధ్యం కాలేదన్నారు. కాంగ్రెస్‌ ప్రతిష్టాత్మకంగా ప్రకటించిన కనీస ఆదాయ హామీ పధకానికీ ఇదే గతి పడుతుందని ఆయన ట్వీట్‌ చేశారు.