మొట్టమొదటి ఎలక్ట్రికల్ డబుల్ డెక్కర్ ఏసీ బస్సు..ముంబయిలో లాంచ్

మొట్టమొదటి ఎలక్ట్రికల్ డబుల్ డెక్కర్ ఏసీ బస్సు..ముంబయిలో లాంచ్

స్విచ్ మొబిలిటీ సంస్థ దేశంలోనే మొట్టమొదటి ఎలక్ట్రికల్ డబుల్ డెక్కర్ ఏసీ బస్సును ఆవిష్కరించింది. ముంబయిలో ఈ బస్సును కేంద్ర రవాణ శాఖమంత్రి నితిన్ గడ్కరీ లాంచ్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రవాణా రంగం సుస్థిర అభివృద్ధికి ఈ ఆవిష్కరణ దోహదపడుతుందన్నారు. దీన్ని వల్ల చమురు దిగుమతులు తగ్గడమే కాకుండా తక్కువ ఖర్చుతో రవాణా సాధ్యమవుతుందని తెలిపారు. 

అశోక్ లేల్యాండ్ కు చెందిన ఈ సంస్థ ఈఐవీ 22 పేరిట ఈ బస్సును లాంచ్ చేసింది. నగర రవాణాకు అనుగుణంగా బస్సును రూపొందించినట్లు కంపెనీ తెలిపింది. ఈ బస్సు ఆధునిక డిజైన్, అత్యున్నత భద్రత, బెస్ట్ ఇన్ క్లాస్ కంఫర్ట్ ఫీచర్లను కలిగివుంది. ఒక్కసారి ఛార్జ్ చేస్తే 250 కిలోమీటర్లు ప్రయాణించొచ్చు. 

ఇప్పటికే బృహన్ ముంబయి మున్సిపల్ కార్పోరేషన్ 200 బస్సుల కోసం ఆర్డర్ చేసిందని కంపెనీ పేర్కొంది. ఈ ఏడాది 50 బస్సులను ముంబయికి డెలివరి చేస్తామని తెలిపిన కంపెనీ.. వచ్చే ఏడాది 150 నుంచి 250 వరకు డెలివరీ చేస్తామని ప్రకటించింది. కాగా 1967లోనే ముంబయిలో అశోక్ లేల్యాండ్ డబుల్ డెక్కర్ బస్సును ఆవిష్కరించింది. ఈ వారసత్వాన్ని స్విచ్ సంస్థ కొనసాగిస్తోందని కంపెనీ స్పష్టం చేసింది.