నిజామాబాద్ బీఆర్ఎస్ కార్పొరేటర్లు కాంగ్రెస్​లోకి

నిజామాబాద్ బీఆర్ఎస్ కార్పొరేటర్లు కాంగ్రెస్​లోకి

హైదరాబాద్, వెలుగు :  నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గానికి చెందిన పలువురు బీఆర్ఎస్ నాయకులు, కార్పొరేటర్లు కాంగ్రెస్​లో చేరారు. బుధవారం గాంధీ భవన్​లో ఎమ్మెల్సీ మహేశ్ కుమార్ గౌడ్, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ సమక్షంలో పార్టీ కండువా కప్పుకున్నారు. ఈ సందర్భంగా మహేశ్ కుమార్ గౌడ్ మాట్లాడారు. రాష్ట్రంలో ఇప్పుడు ప్రజా పాలన నడుస్తోందని, రేవంత్ పాలనతో రాష్ట్ర ప్రజలు కాంగ్రెస్ వైపు చూస్తున్నారని చెప్పారు.

ఆరు గ్యారంటీలను అందరికీ అందేలా చర్యలు తీసుకుంటామన్నారు. షబ్బీర్ అలీ మాట్లాడుతూ.. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రెండు నెలల్లోనే సీఎం రేవంత్ ప్రతి అసెంబ్లీ నియోజకవర్గం అభివృద్ధికి రూ.10 కోట్ల చొప్పున మంజూరు చేశారని గుర్తుచేశారు. తక్కువ సమయంలోనే రాష్ట్రంలో 50 వేల ఉద్యోగాలను భర్తీ చేయబోతున్నామన్నారు. రేవంత్ నాయకత్వంలో తెలంగాణ ప్రజలకు సుపరిపాలన అందుతోందన్నారు. రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపు కోసం కార్యకర్తలంతా కృషి చేయాలని పిలుపునిచ్చారు.