తమ రాష్ట్రంలో కోవిడ్-19 పాజిటివ్గా నిర్ధారణ అయిన వారంతా వైరస్ బారి నుండి బయటపడ్డారని, వారంతా కోలుకోవడం తమకు గర్వకారణమని గోవా రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి విశ్వజిత్ రాణే ఆదివారం తెలిపారు. ఈ నెల 3న ఏడుగురు వ్యక్తులకు కరోనా వైరస్ సోకినట్టు తెలిసిందని, దీంతో వెంటనే వారందరికీ చికిత్స అందజేశామని ఆయన అన్నారు. చికిత్స పూర్తయిన తర్వాత ఈ ఏడుగురికి కోవిడ్-19 నెగెటివ్ అని నిర్థరణ అయినట్లు తెలిపారు.
ప్రస్తుతం తమ రాష్ట్రంలో కరోనా యాక్టివ్ కేసులు సంఖ్య సున్నా అని రాణే తెలిపారు. కోవిడ్-19పై ముందు వరుసలో ఉండి పోరాడుతున్న తమ రాష్ట్ర వైద్యులు, పారిశుద్ధ్య సిబ్బంది, పోలీసులు, నర్సులు తదితరులందరికీ ధన్యవాదాలు తెలిపారు. రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్, సీఎస్ పరిమళ్ రాయ్ , హెల్త్ సెక్రటరీ నీల మోహనన్ కు కృతజ్ఞతలు తెలిపారు. ప్రస్తుతం తమ రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసులు లేకపోయినప్పటికీ, దేశవ్యాప్తంగా అమలవుతున్న లాక్డౌన్ దృష్ట్యా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విధించిన నిబంధనలు, మార్గదర్శకాలను పాటించవలసిన అవసరం ఉందని రాణే అన్నారు.