
కంటోన్మెంట్ ప్రజలను వేధిస్తున్న రోడ్ల సమస్య
ఎప్పుడు పడితే అప్పుడు బ్లాక్ చేస్తున్న మిలటరీ
ప్రత్యామ్నాయ రోడ్లకు ఓకే చెప్పిన ఇరు వర్గాలు
స్కైవే ప్రతిపాదనలతో తెగని పంచాయితీ
హైదరాబాద్, వెలుగు: కంటోన్మెంట్ బోర్డు పరిధిలో ఉంటున్న ప్రజలను ప్రతిరోజూ వేధించే సమస్య రోడ్బ్లాక్ చేయడం. ఆర్మీ ఏరియా కావడంతో పలు రూట్లలో వెహికల్స్ రాకపోకలను ఎప్పుడూ ఆపేస్తుంటారు. దీంతో ఎటు నుంచి ఎక్కడికి వెళ్లాలన్నా ఇబ్బందులు పడక తప్పదు. దీని నుంచి విముక్తి కల్పించడానికి ఆల్టర్నేట్ రూట్స్ఏర్పాటు చేయాలనుకుంటున్నా అది ముందుకు సాగడం లేదు. మిలటరీ రోడ్లను అనుసరిస్తూ ప్రత్యామ్నాయంగా స్కైవే నిర్మాణానికి జీహెచ్ఎంసీ, లోకల్ మిలటరీ అథారిటీ(ఎల్ఎంఏ) మూడేండ్ల క్రితం చేపట్టిన సర్వే రిపోర్టు దుమ్ముకొట్టుకుపోతోంది. మిలటరీ అథారిటీ, సర్కారు మధ్య సఖ్యత లేని కారణంగా సమస్యకు పరిష్కారం లభించడం లేదు.
పరిష్కారమైనట్టే అయ్యి మొదటికి…
కంటోన్మెంట్బోర్డు మిలటరీ ప్రాంతంలోని రోడ్లపై అలహాబాద్ గేట్, వెల్లింగ్టన్ రోడ్, గోఫ్ రోడ్, ఆర్డినెన్స్ రోడ్ పేరుతో నాలుగు ఏరియాల్లో గేట్లు ఏర్పాటు చేశారు. కంటోన్మెంట్బోర్డు చుట్టూ ఉన్న కాలనీలు, బస్తీలైన యాప్రాల్, మల్కాజిగిరి, నేరెడ్మెట్, బొల్లారం, అల్వాల్, సికింద్రాబాద్ప్రాంతాలకు ఈ రూట్ల నుంచే వెళ్తుంటారు. ఏఓసీ రూట్నుంచి ప్రతిరోజు సుమారు రెండున్నరలక్షల మంది ప్రయాణిస్తుంటారు. దేశంలో ఏదైనా సమస్య తలెత్తినపుడు లోకల్మిలటరీ అధికారులు ఈ రోడ్లను టెంపరరీగా మూసివేసి సమస్య తీవ్రత తగ్గిన వెంటనే తిరిగి తెరుస్తారు. అయితే కొన్నేండ్లుగా చీటికీ మాటికీ ఈ రోడ్లను మూసేస్తుండడంతో ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు. సమస్యకు పర్మినెంట్ సొల్యూషన్ చూపేందుకు జీహెచ్ఎంసీ, లోకల్ మిలటరీఅథారిటీ సంయుక్తంగా 2017లో ఆల్డర్నేట్ రోడ్లపై సర్వే నిర్వహించారు. దీంట్లో కంటోన్మెట్ ఏరియాలో రోడ్లనిర్మాణానికి సుమారు 25 ఎకరాల మిలటరీ భూమి అవసరం ఉంటుందని నివేదిక తయారు చేశారు. దీనికి అవసరమైన స్థలాన్ని ఇచ్చేందుకు కూడా మిలటరీ అథారిటీ రెడీ అయ్యింది. అయితే దీనికి ప్రత్యమ్నాయంగా మరోచోట తమకు స్థలాన్ని కేటాయించాలని , లేకుంటే భూమికి నష్టపరిహారం చెల్లించాలని కోరింది. ఈ మేరకు ఇరు వర్గాల మధ్య అవగాహన కుదిరింది. మిలటరీ అథారిటీకి స్థలాన్ని ఇచ్చేందుకు రాష్ర్ట ప్రభుత్వం కూడా అంగీకరించింది. అయితే ఈ ప్రతిపాదనలు ఇలా కొనసాగుతుండగానే మరో వైపు అంతకు ముందే అలహాబాద్ గేట్, వెల్లింగ్టన్ రోడ్, గోఫ్ రోడ్, ఆర్డినెన్స్ రోడ్ ప్రాంతాలలో నాలుగు స్కైవేలు నిర్మించాలన్న ప్రభుత్వ ప్రతిపాదనలు తిరిగి తెరపైకిరావడంతో పాత ప్రతిపాదనలు పక్కదారి పట్టాయి. దీంతో ఈ సమస్య తిరిగి మొదటికి వచ్చింది.
స్కైవేలతో సొల్యూషన్
మిలటరీ ప్రాంతంలో స్కైవేలతో సమస్యకు పరిష్కారం లభిస్తుందని బోర్డు అధికారులు అభిప్రాయపడుతున్నారు. అలహాబాద్ గేట్, వెల్లింగ్టన్ రోడ్, గోఫ్ రోడ్, ఆర్డినెన్స్ రోడ్ ప్రాంతాలను కలుపుతూ ఏఓసీ రూట్ నుంచి వెళ్లేందుకు నిర్మించే స్కైవేలకు ఎలాంటి డిఫెన్స్ ల్యాండ్ అవసరం లేదని, అయితే ఈ ప్రాంతంలో స్కైవేలకు అవసరమైన ఎత్తయిన పిల్లర్ల నిర్మాణానికి మిలటరీ అథారిటి అనుమతిస్తే సరిపోతుందని అభిప్రాయపడుతున్నారు. ఇప్పటికైనా రాష్ట ప్రభుత్వం లోకల్ మిలటరీ అథారితో చర్చలు జరిపి ఈ రూట్ నుంచి స్కైవేలు నిర్మించి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని ప్రజలు కోరుతున్నారు.
For More News..