ఆర్బిట్రేషన్‌ సెంటర్కు భూ కేటాయింపులు రద్దు.. హైకోర్టు కీలక తీర్పు

ఆర్బిట్రేషన్‌ సెంటర్కు భూ కేటాయింపులు రద్దు.. హైకోర్టు కీలక తీర్పు
  • రాయదుర్గంలో 3.70 ఎకరాలు ఇచ్చిన గత బీఆర్​ఎస్​ సర్కార్
  • ​రూ.350 కోట్ల విలువైన భూమిని ఫ్రీగా ఇవ్వడంపై దాఖలైన పిటిషన్లు
  • ప్రైవేట్​ సంస్థకు ఉచిత కేటాయింపులు చెల్లవని తేల్చిచెప్పిన హైకోర్టు 
  • ల్యాండ్‌ రెవెన్యూ రూల్స్‌ 1975ను  బ్రేక్​ చేశారని ఫైర్​.. ఐఏఎంసీ పనితీరు ఆశాజనకంగా లేదని వ్యాఖ్య

హైదరాబాద్, వెలుగు: ఇంటర్నేషనల్‌ ఆర్బిట్రేషన్‌ అండ్‌ మీడియేషన్‌ సెంటర్​ (ఐఏఎంసీ)కు చేసిన భూ కేటాయింపులను హైకోర్టు రద్దు చేసింది. రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలం రాయదుర్గం గ్రామంలో 3.70 ఎకరాలను ఐఏఎంసీకి కేటాయిస్తూ 2021 డిసెంబర్‌ 26న గత బీఆర్​ఎస్​ ప్రభుత్వం జీవో 126  జారీ చేసింది. ఈ జీవో  చెల్లదని, భూ కేటాయింపులను రద్దు చేస్తున్నట్లు జస్టిస్‌ కె. లక్ష్మణ్, జస్టిస్‌ కె. సుజనతో కూడిన డివిజన్‌ బెంచ్‌ శుక్రవారం తీర్పు వెలువరించింది. రూ.350 కోట్ల విలువైన 3.70 ఎకరాల ప్రభుత్వ భూమిని ఉచితంగా ఐఏఎంసీకి కేటాయించడం వల్ల రాష్ట్రానికి తీరని నష్టమన్న పిటిషనర్ల వాదనను  సమర్థించింది. ఉచిత కేటాయింపులు సరికాదని తేల్చిచెప్పింది. అయితే, ఐఏఎంసీకి రూ. 3 కోట్ల ఆర్థిక సహాయం మంజూరు చేయాలనే జీవోలు 76, 6, 365ను సమర్థించింది.

ఐఏఎంసీ పనితీరు ఆశాజనకంగా లేదు 
నాలుగేండ్లలో ఐఏఎంసీ పని తీరు ఆశాజనకంగా లేదని.. గత జనవరి నాటికి 15 ఆర్బిట్రేషన్‌‌‌‌ కేసులను నిర్వహిస్తే అందులో 11, మీడియేషన్‌‌‌‌ కేసుల్లో  57కిగాను 17 సానుకూల పరిష్కారం అయ్యాయన్న లెక్కలను తీర్పులో హైకోర్టు గుర్తు చేసింది. ప్రభుత్వం నుంచి ప్రైవేట్‌‌‌‌ సంస్థ శాశ్వత ప్రాతిపదికపై ఆర్థికసాయం పొందరాదని పేర్కొంది. ఐదేండ్ల తర్వాత కూడా ఆర్థిక సాయం కొనసాగించాలో లేదో రాష్ట్ర ప్రభుత్వం పరిశీలన చేయాలని సూచించింది. దీనికితోడు ఐఏఎంసీ ట్రస్ట్‌‌‌‌ బోర్డు తమ ఆస్తులను విక్రయించేందుకు వీలుగా నిబంధన 6(డి) చేర్చడాన్ని హైకోర్టు తీవ్రంగా తప్పుబట్టింది. ల్యాండ్‌‌‌‌ రెవెన్యూ రూల్స్‌‌‌‌ 1975 నిబంధనను ప్రభుత్వం ఉల్లంఘించి భూకేటాయింపులు జరిపిందని పేర్కొంది. కంపెనీల చట్టం కింద ఐఏఎంసీ రిజిస్టర్​ కాలేదని, కాబట్టి భూకేటాయింపు చెల్లదని తీర్పులో హైకోర్టు స్పష్టం చేసింది. 

మార్కెట్​ విలువ ఆధారంగానే జరగాలి
ల్యాండ్‌‌‌‌ రెవెన్యూ రూల్స్‌‌‌‌1975లోని నిబంధన 3 ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం భూములను మార్కెట్‌‌‌‌ విలువ ఆధారంగానే కేటాయించాలని హైకోర్టు తన తీర్పులో పేర్కొంది. ప్రభుత్వ భూమిని ప్రైవేట్‌‌‌‌ సంస్థకు ఉచితంగా బదిలీ చేయడానికి వీల్లేదని స్పష్టం చేసింది. భూకేటాయింపు జరిపేనాటికి ఐఏఎంసీ కంపెనీ చట్ట ప్రకారం ఒక కంపెనీగా నమోదు కాలేదని, కంపెనీ చట్టం కింద భూకేటాయింపు కాబోదని, కాబట్టి భూకేటాయింపు చెల్లదని తీర్పులో వివరించింది. న్యాయవాదులు కోటి రఘునాథరావు, ఎ.వెంకట్రామిరెడ్డి వ్యక్తిగత హోదాలో వేర్వేరుగా దాఖలు చేసిన ప్రజాహిత వ్యాజ్యాలను ఆమోదించింది. 

ఇవీ వాదనలు
భూ కేటాయింపు, ఆర్థిక సహాయం వంటి ప్రైవేట్‌‌‌‌ ట్రస్ట్‌‌‌‌ ఆధ్వర్యంలోని ఐఏఎంసీకి ఇవ్వడం చట్ట వ్యతిరేకమని పిటిషనర్ల తరఫు సీనియర్‌‌‌‌ అడ్వకేట్​ సరసాని సత్యంరెడ్డి వాదించారు. రూ.350 కోట్ల విలువైన 3.70 ఎకరాల ప్రభుత్వ భూమిని ఉచితంగా ఐఏఎంసీకి కేటాయించడం వల్ల రాష్ట్రానికి తీరని నష్టమని వాదించారు. ప్రైవేటు ట్రస్ట్‌‌‌‌కు నిబంధనలకు విరుద్ధంగా నిధుల కేటాయింపు కూడా చెల్లదని పేర్కొన్నారు. ఐఏఎంసీ తరఫున సీనియర్‌‌‌‌ అడ్వకేట్​దేశాయ్‌‌‌‌ ప్రకాశ్‌‌‌‌రెడ్డి వాదిస్తూ.. ప్రజాప్రయోజనాల కోసమే ప్రభుత్వం భూమి/నిధులు ఇచ్చిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున అడ్వకేట్‌‌‌‌ జనరల్‌‌‌‌ సుదర్శన్‌‌‌‌రెడ్డి వాదనలు వినిపిస్తూ.. కేసుల రాజీ ద్వారా పరిష్కరించుకోవడం ద్వారా కోర్టులపై కేసుల భారం తగ్గుతుందని, ఇందులో ప్రజాహితం ఉన్నందునే ప్రభుత్వం భూమి/నిధులు ఇవ్వాలనే నిర్ణయం తీసుకుందన్నారు.

కోర్టులపై కేసుల పెండెన్సీ తగ్గించేందుకు ప్రత్యామ్నాయ పరిష్కార వివాదానికి ప్రాధాన్యం ఇవ్వాలనే అంశాన్ని పరిగణనలోకి తీసుకోవాలని కోరారు. ఐఏఎంసీ ట్రస్ట్‌‌‌‌లో హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి, రాష్ట్ర న్యాయశాఖ మంత్రితోపాటు సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తులు ట్రస్టీలుగా ఉన్నారని గుర్తుచేశారు. ప్రభుత్వం కేటాయించిన నిధుల్లో ఒక్క రూపాయి కూడా దుర్వినియోగం కాలేదన్నారు. గత జనవరి 28న జరిగిన ఈ వాదనలపై హైకోర్టు శుక్రవారం తీర్పు వెలువరించింది. 

ఇదీ నేపథ్యం..
అంతర్జాతీయ స్థాయిలో ఆర్బిట్రేషన్‌‌ సెంటర్‌‌ ఏర్పాటు చేయాలని అప్పటి సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌‌ ఎన్వీ రమణ ప్రతిపాదించగా.. అందుకు తగ్గట్టుగా నాటి సీఎం కేసీఆర్​సెంటర్​ ఏర్పాటుకు అనుమతులు ఇచ్చారు. నానక్‌‌రాంగూడ, ఫీనిక్స్, వీకే టవర్స్‌‌లో ప్రభుత్వమే ఈ సెంటర్​కు భవన సదుపాయాలను తాత్కాలిక ప్రాతిపదికపై కల్పించింది. దీన్ని 2021లో సీజేఐగా ఉన్న జస్టిస్‌‌ ఎన్వీ రమణ ప్రారంభించారు. ఆ తర్వాత ఐఏఎంసీకి శాశ్వత భవన వసతి కోసం రాష్ట్ర ప్రభుత్వం శేరిలింగంపల్లి మండలం రాయదుర్గ్‌‌లోని సర్వే 83/1లో 3.70 ఎకరాల భూమిని కేటాయిస్తూ జీవో 126 జారీ చేసింది.  నానక్‌‌రాంగూడ, ఫీనిక్స్, వీకే టవర్స్‌‌లో ప్రభుత్వం ఈ సెంటర్​కు వసతిని కల్పించడమే కాకుండా నిర్వహణ కోసం ఏటా ప్రభుత్వం రూ.3 కోట్లు ఇచ్చేలా జీవోలను జారీ చేసింది.