ప్రస్తుతం డిజిటల్ యుగం నడుస్తోంది. థియేటర్లకు వెళ్లకుండానే ఇంట్లోనే కూర్చుని టీవీల్లో, స్మార్ట్ ఫోన్ లల్లో సినిమాలు, వెబ్ సిరీస్ లు చూస్తూ ఎంజాయ్ చేస్తున్నాం. సస్పెన్స్ థ్రిల్లర్స్, క్రైమ్ డ్రామాలు, లవ్ స్టోరీస్ వంటి విభిన్న కాన్సెప్ట్లతో, మల్టిపుల్ ఎపిసోడ్లుగా వచ్చే వెబ్ సిరీస్లు ప్రేక్షకులకు సరికొత్త ఎంటర్టైన్మెంట్ను ఇస్తున్నాయి. స్టార్ హీరోలు, దర్శకులు, నిర్మాతలు కూడా ఇప్పుడు ఓటీటీల వైపు అడుగులు వేస్తున్నారు. భాషా బేధం లేకుండా ప్రపంచవ్యాప్త కంటెంట్ను మన చేతి వేళ్లపైకి తెస్తూ, నేటి తరం లైఫ్స్టైల్లో ఓటీటీ ఒక భాగమైపోయింది.
నిర్మాతలకు చుక్కలు..
అయితే లేటెస్ట్ గా టాలీవుడ్ టాప్ ప్రొడ్యూసర్ దిల్ రాజు ఓటీటీ మార్కెట్ గురించి కొన్ని షాకింగ్ నిజాలను బయటపెట్టారు. ఒకప్పుడు తమ సినిమాలకు కామధేనువులా మారిన ఓటీటీ ప్లాట్ఫామ్స్, ఇప్పుడు నిర్మాతలకు ఎలా చుక్కలు చూపిస్తున్నాయో ఆయన పూసగుచ్చినట్లు వివరించారు. డిజిటల్ ప్లాట్ ఫామ్ లో కూడా నిర్మాతకు కష్టాలు తప్పడం లేదేని చెప్పుకొచ్చారు.
ఓటీటీ సంస్థలు యూ-టర్న్..
మొదట్లో సబ్స్క్రైబర్లను పెంచుకోవడానికి నెట్ఫ్లిక్స్, ప్రైమ్, హాట్స్టార్ లాంటి కార్పొరేట్ సంస్థలు కోట్లాది రూపాయలు గుమ్మరించి, దొరికిన సినిమానల్లా కొనేశాయి. కానీ, సీన్ కట్ చేస్తే.. వాళ్ళు పెట్టిన పెట్టుబడికి, వచ్చిన వ్యూస్కు అస్సలు పొంతన లేదు అన్నారు దిట్ రాజు. కార్పొరేట్ కంపెనీలు తమ బ్యాలెన్స్ షీట్లు చూసుకుని షాకయ్యాయి. లాభాలు రావడం లేదని తెలీగానే రాత్రికి రాత్రే యూ-టర్న్ తీసుకున్నాయి. ప్రస్తుతం నాన్-థియేట్రికల్ మార్కెట్ పరిస్థితి చాలా ఘోరంగా ఉంది అని దిల్ రాజు వాపోయారు.
థియేటర్ హిట్ అయితేనే రేటు
ఇప్పుడు ఓటీటీ సంస్థలు కొత్త రూల్స్ తెచ్చాయి. మునుపటిలా ముందే వంద కోట్లు, యాభై కోట్లు ఫిక్స్ చేయడం లేదు. సినిమా బాక్సాఫీస్ దగ్గర ఎంత కలెక్ట్ చేస్తే..
ఓటీటీలో అంత రేటు అనే కొత్త అగ్రిమెంట్లు రాసుకుంటున్నారు. దీనివల్ల ఓటీటీ డీల్స్ ఏకంగా 50% వరకు పడిపోయాయని దిల్ రాజ్ చెప్పుకొచ్చారు.. ఇప్పుడు చాలా మంది నిర్మాతలు థియేటర్ రిలీజ్ కంటే ముందే ఓటీటీ పార్ట్నర్స్కు సినిమాను ప్రత్యేకంగా చూపించి, ఒప్పందం కుదుర్చుకున్నాకే రిలీజ్ డేట్ అనౌన్స్ చేస్తున్నారు. ఒకవేళ అలా చేయకుండా, సినిమా థియేటర్లో ఫ్లాప్ అయితే.. ఇక ఓటీటీ వాడు రూపాయి కూడా ఇవ్వడు!
పే పర్ వ్యూదెబ్బ..
దిల్ రాజు తనకు ఎదురైన ఒక చేదు అనుభవాన్ని కూడా షేర్ చేసుకున్నారు. ఆయన నిర్మించిన ఒక చిన్న సినిమాకు మొదట ఓటీటీ సంస్థ రూ. 6 కోట్లు ఇస్తామని అగ్రిమెంట్ చేసుకుందట. కానీ, కొన్ని కారణాల వల్ల సినిమా లేట్ అవ్వడంతో ఆ అగ్రిమెంట్ క్యాన్సిల్ అయిపోయింది. తీరా సినిమా రిలీజ్ అయ్యాక, సదరు ఓటీటీ సంస్థ దాన్ని 'పే-పర్-వ్యూ' మోడల్లో పెట్టింది. ఫలితంగా రూ. 6 కోట్లు రావాల్సిన చోట వచ్చింది కేవలంరూ1.5 కోట్లు మాత్రమే అని దిల్ రాజు ఆవేదన వ్యక్తం చేశారు.
సినిమా బాగుంటేనే థియేటర్లలో జనాలు చూస్తున్నారు.. థియేటర్లలో చూస్తేనే ఓటీటీ వాళ్లు కొంటున్నారు. మొత్తానికి, ఓటీటీల పుణ్యమా అని ఇండస్ట్రీలో ఈజీ మనీ రోజులు పోయాయి. కంటెంట్ క్రేజీగా ఉంటేనే ఓటీటీలోనైనా, థియేటర్లోనైనా రాజు.. లేదంటే నిర్మాతకు లాసే అన్న పరిస్థతి నెలకొంది.
