- 29న ఖాళీ స్టేడియంలో మ్యాచ్
హైదరాబాద్, వెలుగు: వన్డే వరల్డ్కప్లో హైదరాబాద్లో ఇండియా మ్యాచ్లు లేకపోవడంతో నిరుత్సాహంగా ఉన్న భాగ్యనగర క్రికెట్ అభిమానులకు మరో చేదు వార్త. ఉప్పల్లో ఈ నెల 29న పాకిస్తాన్–-న్యూజిలాండ్ మధ్య వార్మప్ మ్యాచ్ ఖాళీ స్టేడియంలో జరగనుంది. ఈ మ్యాచ్కు ప్రేక్షకులను అనుమతించడం లేదు. ఈ నెల 28న గణేష్ నిమజ్జనం, మిలాద్ -ఉన్ -నబీ పండగ ఉండటంతో ఈ మ్యాచ్కు భద్రత కల్పించలేమని సిటీ పోలీసులు హెచ్సీఏకు స్పష్టం చేశారు. ఇదే విషయాన్ని హెచ్సీఏ.. బీసీసీఐకి తెలిపింది.
‘ఒకే రోజు రెండు పండగలు రావడంతో భద్రత విషయంలో ఇబ్బంది ఉంటుందని పోలీసులు తెలిపారు. దాంతో ఈ మ్యాచ్ను ఖాళీ స్టేడియంలో నిర్వహించాలని బీసీసీఐ సెక్రటరీ జై షా, వైస్ ప్రెసిడెంట్ రాజీవ్ శుక్లాకు చెబితే సూత్రప్రాయంగా అంగీకరించారు. సోమవారం బీసీసీఐకి లెటర్ కూడా రాశాం. బోర్డు నుంచి అధికారిక సమాచారం కోసం ఎదురు చూస్తున్నాం’ అని రిటైర్డ్ జస్టిస్ లావు నాగేశ్వర రావుకు సాయంగా హెచ్సీఏ వ్యవహారాలు పర్యవేక్షిస్తున్న దుర్గాప్రసాద్ తెలిపారు. అక్టోబర్ 3న ఆస్ట్రేలియా–పాక్ వార్మప్తో పాటు మూడు వరల్డ్కప్ మ్యాచ్లు ఫ్యాన్స్ మధ్యన షెడ్యూల్ ప్రకారమే జరుగుతాయని స్పష్టం చేశారు.