బీఆర్ఎస్​కు ఫ్యూచర్ లేదు: బీజేపీ ఎంపీ లక్ష్మణ్

బీఆర్ఎస్​కు ఫ్యూచర్  లేదు: బీజేపీ ఎంపీ లక్ష్మణ్

హైదరాబాద్, వెలుగు : బీఆర్ఎస్ కు ఫ్యూచర్  లేదని, లోక్ సభ ఎన్నికల తర్వాత ఆ పార్టీ పని అయిపోతుందని బీజేపీ ఎంపీ, ఓబీసీ మోర్చా నేషనల్  ప్రెసిడెంట్ లక్ష్మణ్  అన్నారు. లోక్ సభ ఎన్నికల్లో అభివృద్ధికి, అబద్ధాలకు మధ్య పోరు జరుగుతుందని, ఈ ఎన్నికల్లో రాష్ట్రంలో తమ పార్టీ 10కి పైగా సీట్లు గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్, బీఆర్ఎస్  కలిసి పోటీ చేస్తాయన్నారు. ఆదివారం పార్టీ స్టేట్  ఆఫీసులో మీడియాతో లక్ష్మణ్  మాట్లాడారు. ఇండియా కూటమి చీలికలతో కొట్టుమిట్టాడుతోందన్నారు.

భారత్  జోడో పేరుతో రాహుల్  యాత్ర చేస్తుంటే కూటమి పార్టీలు కాంగ్రెస్  ఛోడో అంటున్నాయని, ఆ కూటమికి ఎజెండా, నీతి లేదని విమర్శించారు. ఇక ఆరు గ్యారంటీలు అమలు చేయకుండా దాటవేసేందుకు కాంగ్రెస్  ప్రయత్నిస్తున్నదని ఆరోపించారు.  ఓఆర్ఆర్, కాళేశ్వరం, ధరణి అవినీతిపై సీబీఐతో దర్యాప్తు చేయించాలని డిమాండ్  చేసిన సీఎం రేవంత్.. ఇపుడు నోరు మెదపడం లేదని ఫైర్  అయ్యారు. బీజేపీ సీనియర్  ఎల్ కే అద్వానీ దేశం కోసం, ధర్మం కోసం విలువలతో కూడిన రాజకీయాలను చేశారని, ఆయనకు భారతరత్న ఇచ్చినందుకు కేంద్రానికి, ప్రధాని నరేంద్ర మోదీకి ధన్యవాదాలు తెలిపారు.