- ఏడాది కిందటి ఈసీ తీర్మానం ఇప్పుడు తెరపైకి
- రాజకీయ సభలకు అనుమతి లేదంటూ అందులో వెల్లడి
- మీటింగ్ పెట్టి తీరుతామంటున్న విద్యార్థులు, కాంగ్రెస్ నేతలు
హైదరాబాద్/ ఓయూ, వెలుగు: ఉస్మానియా యూనివర్సిటీలో కాంగ్రెస్ కీలక నేత రాహుల్గాంధీ సభకు అధికారులు ఇన్ డైరెక్ట్గా నో చెప్పారు. నిరుడు జూన్ 22న వర్సిటీ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ చేసిన తీర్మానాన్ని ఇప్పుడు టీఆర్ఎస్ లీడర్లు తెరపైకి తెచ్చారు. ఆ కాపీలోని మినిట్స్ను సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. యూనివర్సిటీ ప్రాంగణంలో రాజకీయ, మత పరమైన సమావేశాలకు అనుమతి లేదని చెప్తున్నారు. దీనిపై విద్యార్థులు, ప్రజాస్వామికవాదులు మండిపడుతున్నారు. తెలంగాణ ఉద్యమానికి ఊపిరినిచ్చిన ఉస్మానియా యూనివర్సిటీలో ఇతరులెవరినీ సభ పెట్టుకోవద్దంటే ఏందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
అయితే వర్సిటీ అధికారులు మాత్రం.. రాహుల్ సభకు అనుమతిపై తాము ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని, ఈ అంశం కోర్టు పరిధిలో ఉందని అన్నారు. రాహుల్ ఈ నెల ఆరు, ఏడు తేదీల్లో రాష్ట్రంలో పర్యటించనున్నారు. ఆరో తేదీన వరంగల్లో నిర్వహించే రైతు సంఘర్షణ బహిరంగ సభలో ఆయన పాల్గొంటారు. ఏడో తేదీన ఓయూలో విద్యార్థులు, యువతతో ముఖాముఖి సమావేశం కావాలని నిర్ణయించారు. ఈ సమావేశానికి అనుమతి ఇవ్వాలని కోరుతూ కాంగ్రెస్ నేతలు ఓయూ వీసీని కలిసి విజ్ఞప్తి చేశారు. రాహుల్ సభకు పర్మిషన్ ఇవ్వొద్దని కోరుతూ టీఆర్ఎస్వీ నాయకులు వీసీకి వినతిపత్రం అందజేశారు.
రాహుల్ పర్యటనకు అనుమతిపై వీసీ స్పష్టత ఇవ్వకపోవడంతో కాంగ్రెస్ నేతలు.. పర్మిషన్ ఇవ్వాలని కోరుతూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. శనివారం మధ్యాహ్నం రాహుల్ సభకు ఓయూ అధికారులు అనుమతి నిరాకరించారంటూ టీఆర్ఎస్ నేతలు సోషల్ మీడియాలో ప్రచారం మొదలు పెట్టారు. ఏడాది క్రితం నాటి ఈసీ నిర్ణయాలను సర్క్యులేట్ చేశారు. దీంతో వర్సిటీలో స్వల్ప ఉద్రిక్తత చోటు చేసుకుంది.
నిరుద్యోగ జేఏసీ చైర్మన్ చనగాని దయాకర్ ఆధ్వర్యంలో విద్యార్థులు ఆర్ట్స్ కాలేజీ వద్ద ఆందోళన చేశారు. సీఎం కేసీఆర్ దిష్టిబొమ్మ దహనం చేసేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో విద్యార్థులు ఆర్ట్స్ కాలేజీ పైకి ఎక్కి నిరసన తెలిపారు. కాంగ్రెస్ నాయకుడు కోటూరి మానవతారాయ్, నిరుద్యోగ జేఏసీ చైర్మన్ దయాకర్ మాట్లాడుతూ.. ప్రభుత్వ పెద్దల ఒత్తిడికి తలొగ్గే ఓయూ అధికారులు రాహుల్ పర్యటనకు అనుమతి ఇవ్వడం లేదన్నారు.
ఓయూ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ తీర్మానాలు ఇవీ..
2021 జూన్ 22న వైస్ చాన్స్లర్ డి.రవీందర్ అధ్యక్షతన నిర్వహించిన ఉస్మానియా యూనివర్సిటీ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ సమావేశంలో పలు నిర్ణయాలు తీసుకున్నారు. రాహుల్ పర్యటన నేపథ్యంలో ఆ మినిట్స్ కాపీ సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతున్నది. వర్సిటీ ఆవరణలో సమావేశాలు నిర్వహించడం, బర్త్ డే వేడుకలు, ఆందోళనలు నిర్వహించడం లాంటి నాన్ అకడమిక్ కార్యక్రమాలను నిషేధించారు.
వర్సిటీ గెస్ట్ హౌస్, కాన్ఫరెన్స్ హాల్స్, బోర్డ్ రూమ్లు, ఇతర ప్రాంతాల్లో విద్యార్థి సంఘాలు, ఇతర ఆర్గనైజేషన్ల ప్రెస్ కాన్ఫరెన్స్లు, ఇతర సమావేశాలకు అనుమతి లేదు. వర్సిటీ ప్రొఫెసర్లు అతిథిలుగా హాజరైనా ఇలాంటి కార్యక్రమాలకు పర్మిషన్ ఇచ్చేది లేదని స్పష్టం చేశారు. వర్సిటీ ప్రాంగణంలో రాజకీయ, మత పరమైన సంస్థలు, ఇతర సంఘాలు సమావేశాలు పెట్టుకునేందుకు అనుమతి లేదని తేల్చిచెప్పారు.
ఏదైనా విద్యార్థి సంఘం అకడమిక్ చర్చలు, డిబేట్స్ నిర్వహించడానికి వర్సిటీ అధికారులను సంప్రదించి అనుమతి తీసుకోవాలని, మధ్యాహ్నం 2 గంటల తర్వాతే అలాంటి కార్యక్రమాలకు పర్మిషన్ ఇస్తామని వెల్లడించారు. ఈ నిబంధనలు అతిక్రమించే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
ఇలాంటి నిర్బంధం మంచిది కాదు: కోదండరాం
విద్యార్థులు ఏర్పాటు చేసుకునే సమావేశానికి రాహుల్ గాంధీ హాజరైతే అనుమతి ఇవ్వాల్సి ఉంటుందని తెలంగాణ జనసమితి అధ్యక్షుడు కోదండరాం అన్నారు. తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన వర్సిటీలో ఇలాంటి నిర్బంధం మంచిది కాదని పేర్కొన్నారు.