నామినేటెడ్ లిస్టులు రెడీ

నామినేటెడ్ లిస్టులు రెడీ

ప్రజాప్రతినిధులకు కార్పొరేషన్​ పదవులపై కసరత్తు పూర్తి
వలస ఎమ్మెల్యేలకు ప్రయారిటీ!
కొందరు సీనియర్​
నాయకులకూ చాన్స్
ఓడిన నేతల పేర్లూ ప్రచారంలోకి..
త్వరలోనే అధికారిక ప్రకటన
తమ పరిస్థితి ఏమిటని ఉద్యమ నాయకుల్లో ఆందోళన

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కొందరు టీఆర్ఎస్​ సీనియర్లకు నామినేటెడ్  పదవులు ఇచ్చేందుకు రంగం సిద్ధమైంది. మంత్రివర్గంలో చోటు దక్కని నేతలకు కార్పొరేషన్ల పదవులు రానున్నాయి. ఈ మేరకు సర్కారు పెద్దలు కసరత్తు పూర్తి చేశారని, ఏ కార్పొరేషన్​కు ఎవరిని నియమించాలన్న దానిపై సీఎం కేసీఆర్​ ఇప్పటికే ఓ నిర్ణయానికి వచ్చినట్టు సమాచారం. కాంగ్రెస్ నుంచి గెలిచి టీఆర్ఎస్ లో చేరిన ఎమ్మెల్యేలకు ప్రయారిటీ ఉంటుందని, కొందరు సీనియర్​ నేతలకూ చాన్స్​ ఇచ్చే అవకాశం ఉందని తెలిసింది. ‘‘ఇప్పటికే నామినేటెడ్ పదవుల జాబితా తయారైంది. ‘తెలంగాణ పేమెంట్స్ అండ్ పెన్షన్ అండ్ రిమూవల్ ఆఫ్ డిస్ క్వాలిఫికేషన్’ ఆర్డినెన్స్ రావాలి. అది రాగానే నియామకాలు ఉంటాయి’’ అని ఓ సీనియర్ అధికారి చెప్పారు.

వలస వచ్చినోళ్లకు..

కాంగ్రెస్  టికెట్ మీద గెలిచిన సబితా ఇంద్రారెడ్డికి మంత్రి పదవి ఇచ్చారు. ఆమె ఒక్కరినే కేబినెట్లోకి తీసుకుంటే మిగతా వారి పరిస్థితి ఏమిటని మిగతా 11 మంది ఎమ్మెల్యేల్లో అసంతృప్తి ఉంది. ఈ నేపథ్యంలో కార్పొరేషన్​ పదవుల్లో కాంగ్రెస్ నుంచి వచ్చిన ఎమ్మెల్యేలకు చాన్స్​ ఇచ్చే అవకాశం ఉందని రాజకీయ వర్గాలు చెప్తున్నాయి. కాంగ్రెస్ నుంచి వచ్చి చేరినోళ్లలో.. గండ్ర వెంకటరమణారెడ్డి, సుధీర్ రెడ్డి, చిరుమర్తి లింగయ్య, రోహిత్ రెడ్డి, హరిప్రియా నాయక్, వనమా వెంకటేశ్వర రావు, ఆత్రం సక్కు పేర్లు వినిపిస్తున్నాయి ఇక టీఆర్ఎస్  ఎమ్మెల్యేలు బాజిరెడ్డి గోవర్ధన్, పద్మా దేవేందర్ రెడ్డి, ఆరూరి రమేష్, కేపీ వివేకనందగౌడ్, బిగాల గణేశ్​గుప్తా, రేఖా నాయక్ ల పేర్లు పరిశీలనలో ఉన్నట్టు తెలిసింది. ఎమ్మెల్సీలు నాయిని నర్సింహారెడ్డి, కడియం శ్రీహరి, గత ఎలక్షన్లలో ఓడిన జూపల్లి కృష్ణారావు, మాజీ స్పీకర్ మధుసూదనాచారిలకు నామినేటెడ్ పదవులు ఇస్తానని కేసీఆర్​ గతంలో హామీ ఇచ్చి ఉన్నారు. ఇప్పుడు వారికి చాన్స్​ ఇస్తారా, లేదా అన్నదానిపై చర్చ జరుగుతోంది.

ఉద్యమ నాయకుల్లో అసంతృప్తి

ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ, ఎంపీలకు నామినేటెడ్ పదవులు ఇచ్చేందుకు చట్టసవరణ చేయాలన్న సీఎం నిర్ణయంపై టీఆర్ఎస్ లోని ఉద్యమ నాయకులు అసంతృప్తితో ఉన్నారు. ఉద్యమంలో పనిచేసిన వారికి ఇప్పటికైనా అవకాశం ఇవ్వకుంటే ఎట్లాగని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ‘గత ప్రభుత్వంలో పదవి ఇవ్వలేదు. ఈసారి ఇస్తారనుకున్నం. మళ్లీ పదవులను ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకే ఇస్తరా?’అని ఉద్యమ సమయం నుంచి పార్టీలో ఉన్న ఓ సీనియర్ నాయకుడు మండిపడ్డారు. ప్రస్తుతం పార్టీకి ఉద్యమ నాయకుల అవసరం లేదని, అందుకే పట్టించుకోవడం లేదని మరో సీనియర్ నాయకుడు బాధపడ్డారు. అంతేకాదు ఉద్యమ నాయకుల్లో పదవి వచ్చిన వారికి కూడా మరోసారి పదవి ఇస్తారా లేదా అన్న ఆందోళన ఉన్నట్టు టీఆర్ఎస్​ వర్గాలు చెప్తున్నాయి. అలాంటివారు మళ్లీ పదవి ఇచ్చేలా మంత్రి కేటీఆర్ ద్వారా ప్రయత్నాలు చేస్తున్నట్టు పేర్కొంటున్నాయి.

రాజ్ భవన్ కు చేరిన ఆర్డినెన్స్ ఫైల్

రాష్ట్రంలో 28 కార్పొరేషన్లను లాభదాయక పదవుల జాబితా నుంచి తొలగించేందుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. దీనికి సంబంధించి ఆర్డినెన్స్ తెచ్చేందుకు ఫైల్ కూడా సిద్ధం చేశారు. ప్రస్తుతం ఆ ఫైల్ రాజ్ భవన్ కు చేరిందని, గవర్నర్​ సంతకం కాగానే ఆర్డినెన్స్​ జారీ అవుతుందని అధికార వర్గాలు వెల్లడించాయి. ఆ వెంటనే కొందరు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు నామినేటెడ్ పదవులను ప్రకటిస్తారని సమాచారం.

‘ప్రాఫిట్’రూల్​ నుంచి మినహాయించిన కార్పొరేషన్లు

రాష్ట్ర విభజనకు ముందు 91 కార్పొరేషన్ పదవులు ఉండేవి. తెలంగాణ ఏర్పాటయ్యాక కాళేశ్వరం, మిషన్ భగీరథతోపాటు మరికొన్ని కార్పొరేషన్లు ఏర్పాటు చేశారు. అయితే ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, ఎంపీల వంటి ప్రజాప్రతినిధులు కార్పొరేషన్లు, ఇతర లాభదాయక పదవులు చేపట్టకుండా ‘ఆఫీస్​ ఆఫ్​ ప్రాఫిట్’రూల్​ అడ్డుపడుతోంది. దీంతో 28 కార్పొరేషన్లను ‘ప్రాఫిట్’రూల్ జాబితా నుంచి తొలగించాలని సీఎం కేసీఆర్​ నిర్ణయించారు. ఈ మేరకు ఆర్డినెన్స్​ జారీకి రంగం సిద్ధమైంది.

కొన్ని కీలకమైన కార్పొరేషన్లు

  1. ఆగ్రోస్
  2. గిడ్డంగుల కార్పొరేషన్
  3. డెయిరీ డెవలప్ మెంట్ కార్పొరేషన్
  4. గిరిజన కో ఆపరేటివ్ కార్పొరేషన్
  5. ఎస్సీ ఫైనాన్స్ కార్పొరేషన్
  6. ఫిల్మ్ డెవలప్​ మెంట్ కార్పొరేషన్
  7. మిషన్ భగీరథ
  8. రైతు సమన్వయ సమితి
  9. బేవరేజెస్​ కార్పొరేషన్
  10. మినరల్ డెవలప్ మెంట్ కార్పొరేషన్
  11. హస్తకళల అభివృద్ది కార్పొరేషన్​
  12. టెక్నాలజీ సర్వీసెస్
  13. రోడ్డు డెవలప్ మెంట్ కార్పొరేషన్
  14. ఉమెన్ కో ఆపరేటివ్ ఫైనాన్స్ కార్పొరేషన్