V6 News

Naga Chaitanya: INCA వేదికపై మెరిసిన నాగ చైతన్య.. బెస్ట్ యాక్టర్‌గా అవార్డు

Naga Chaitanya: INCA వేదికపై మెరిసిన నాగ చైతన్య.. బెస్ట్ యాక్టర్‌గా అవార్డు

ముంబైలో ఇండియన్ నేషనల్ సినీ అకాడమీ (INCA–2026) అవార్డుల ప్రధానోత్సవం అట్టహాసంగా జరిగింది. దేశవ్యాప్తంగా 12 భాషల చిత్రాలకు అవార్డులు ప్రదానం చేశారు. ఈ సందర్భంగా ‘తండేల్’ చిత్రానికి గాను అక్కినేని నాగ చైతన్య ఉత్తమ నటుడిగా అవార్డు అందుకున్నారు. ‘తండేల్’ సినిమాలో ‘తండేల్ రాజు పాత్ర’లో పోషించిన అద్భుత నటనకు గానూ ఈ గౌరవం లభించింది.

ఇటీవల తెలంగాణ గద్దర్ పురస్కారాల్లో ఉత్తమ నటుడిగా అవార్డు అందుకున్న నాగ చైతన్యకు ఇది వరుస విజయంగా నిలిచింది. భిన్నమైన కథలు, బలమైన పాత్రలతో ముందుకు సాగుతున్న నాగ చైతన్యకు ఈ అవార్డు మరింత గుర్తింపును తెచ్చిపెట్టింది.

ఈ సందర్భంగా నాగ చైతన్య మాట్లాడుతూ, “ప్రతి సినిమా, ప్రతి పాత్ర మనకు ఎంతో నేర్పిస్తుంది. ‘తండేల్’ నా జీవితంలో ప్రత్యేకమైన సినిమా. తండేల్ రాజు పాత్ర ద్వారా చాలా నేర్చుకున్నాను. శ్రీకాకుళం మత్స్యకారుల కథలను తెరపైకి తీసుకురావడం నాకు మరపురాని అనుభవం. దర్శకుడు చందూ మొండేటి, నిర్మాతలు అల్లు అరవింద్, బన్నీ వాసు, హీరోయిన్ సాయి పల్లవి, సంగీత దర్శకుడు దేవి శ్రీ ప్రసాద్ మరియు మొత్తం టీమ్‌కు కృతజ్ఞతలు,” అని తెలిపారు.

‘తండేల్’ సినిమాతో పాటు ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమాకి గాను అనిల్ రావిపూడి ఉత్తమ దర్శకుడిగా అవార్డు అందుకున్నారు. బుల్లిరాజు బెస్ట్ చైల్డ్ కమెడియన్గా పురస్కారం దక్కించుకున్నారు.

నాగ చైతన్య తండేల్:

'తండేల్' సినిమా మత్స్యకారుల జీవితాలపై తెరకెక్కింది. దేశ‌భ‌క్తికి, ప్రేమ‌క‌థ‌ను జోడించి దర్శకుడు చందు మొండేటి ఈ సినిమాను అద్భుతంగా రూపొందించారు. మత్స్యకారులు వేటకు వెళ్లిన తర్వాత సముద్రంలో ఎదుర్కొనే సవాళ్లను దర్శకుడు కళ్లకు కట్టినట్లుగా సినిమాలో చూపించారు. ఇందులో రాజు అనే మత్స్యకారుడి పాత్రలో నాగ చైతన్య జీవించేశాడు. ఫైట్స్, యాక్షన్ సీక్వెన్స్లో అదరగొట్టాడు. సహజ నటి సాయి పల్లవి బుజ్జితల్లిగా మెప్పించింది. నిజజీవిత పాత్రలు ఐన రాజు-సత్యల కోసమే పుట్టినట్లుగా చై-సాయి పల్లవి మెప్పించారు. ఇద్ద‌రూ శ్రీకాకుళం యాస‌లో సంభాష‌ణ‌లు అద్భుతంగా పలికారు.

తండేల్ కథ: 2018లో శ్రీకాకుళానికి చెందిన మత్య్సకారులు గుజరాత్‍లో చేపల వేటకు దిగి అనుకోకుండా సముద్రంలో పాకిస్థాన్ హద్దులకు వెళ్లారు. అక్కడ పాక్ సైన్యానికి పట్టుబడ్డారు. పాక్ జైలులో కొన్ని నెలల పాటు చిత్ర హింసలు అనుభవించారు. ఆ తర్వాత మళ్లీ భారత్‍కు చేరారు. వారిలో మత్స్యకారుడు రాజు కూడా ఒకరు. అతడి నిజ జీవిత కథ ఆధారంగానే తండేల్ చిత్రం రూపొందింది.