ఉత్తరకొరియా దేశాధినేత కిమ్ జోంగ్ ఉన్ తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నారట. ఈ విషయాన్ని కిమ్ సోదరి కిమ్ యో జోంగ్ వెల్లడించారు. అయితే.. కిమ్ కు కరోనా సోకిందా..? లేదా ఇంకా ఏదైనా అనారోగ్య సమస్య తలెత్తిందా..? అన్న విషయంపై మాత్రం యో జోంగ్ స్పష్టత ఇవ్వలేదు. కిమ్ ఎప్పుడు అనారోగ్యానికి గురయ్యారన్న విషయాన్ని కూడా ఆమె చెప్పలేదు. కిమ్ అనారోగ్యం గురించి ఆయన సోదరి కిమ్ యో జోంగ్ ఓ ప్రసంగంలో చెప్పినట్లు ఉత్తరకొరియా అధికారిక మీడియా వెల్లడించింది. జ్వరం కారణంగా తన సోదరుడు కిమ్ జోంగ్ ఉన్ తీవ్ర అనారోగ్యానికి గురయ్యారని తెలిపారు. ప్రజల పట్ల ఉన్న ఆందోళనల కారణంగా కిమ్ ఒక్క క్షణం కూడా విశ్రాంతి తీసుకోలేదన్నారు.
ఉత్తరకొరియాను వణికిస్తున్న కరోనా వైరస్
కరోనా మహమ్మారితో రెండేళ్ల పాటు యావత్ ప్రపంచం అల్లాడిన సమయంలో ఒక్క కేసు కూడా నమోదుకాని ఉత్తరకొరియాలో ఇటీవల వైరస్ విజృంభించింది. రోజుల వ్యవధిలోనే లక్షల మంది కోవిడ్ తో అల్లాడిపోయారు. అప్పుడే కిమ్ జోంగ్ ఉన్ కూడా తీవ్ర అనారోగ్యం పాలయ్యారని మీడియా కథనాల ద్వారా తెలుస్తోంది. ఈ ఏడాది ఉత్తరకొరియాలో కరోనా మహమ్మారి విజృంభించి.. దాదాపు 48 లక్షల మంది ప్రజలు విష జ్వరాల బారిన పడ్డారు. ఆ దేశంలో సరైన వైద్య సదుపాయాలు , కరోనా పరీక్షల కిట్లు అందుబాటులో లేకపోవడంతో కొవిడ్ కేసులుగా ఉత్తరకొరియా చెప్పలేదు. కేవలం కొన్ని కేసులను మాత్రమే కరోనా కేసులుగా నిర్ధారించింది.
దక్షిణకొరియాపై కిమ్ యో జోంగ్ ఆరోపణలు
దక్షిణకొరియాపై కిమ్ సోదరి కిమ్ యో జోంగ్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఆ దేశ ‘కీలుబొమ్మలు’ తమ సరిహద్దుల్లోకి బెలూన్ల ద్వారా విష వస్తువులను పంపించారని, అందుకే ఉత్తర కొరియాలో కోవిడ్ వైరస్ విజృంభించిందని ఆరోపించారు. ఉత్తరకొరియా అధినేత కిమ్ అనారోగ్యానికి గురయ్యారంటూ ఆ దేశం స్వయంగా ఒప్పుకోవడం ఇదే మొదటిసారి. గత కొంతకాలంగా కిమ్ అనారోగ్యంపై చాలా వార్తలు వస్తోన్న విషయం తెలిసిందే. అధిక బరువుతో బాధపడుతున్న కిమ్.. ఇటీవల గుండె సంబంధిత వ్యాధితో ఆసుపత్రిలో చేరినట్లు పలు కథనాలు వచ్చాయి.