పద్మారావునగర్, వెలుగు: ప్రజా భద్రతలో రాజీ పడేది లేదని, హోటళ్లు, లాడ్జీల నిర్వాహకులు కచ్చితంగా నిబంధనలు పాటించాలని నార్త్ జోన్ డీసీపీ సాధన రష్మి పెరుమాళ్ ఆదేశించారు. బుధవారం హోటళ్లు, లాడ్జీల యజమానులు, మేనేజర్లతో డీసీపీ సమావేశం నిర్వహించారు.
నిబంధనల ప్రకారం హోటళ్లు, లాడ్జీలు నడపాలని సూచించారు. ప్రజా భద్రతకు విరుద్ధంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. హోటళ్లలో సందర్శకుల రిజిస్టర్ను సక్రమంగా నిర్వహించాలని, సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలన్నారు. హోటళ్ల ప్రాంగణాల్లో కార్యక్రమాలు, సమావేశాలు నిర్వహించే ముందు పోలీసుల అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలని సూచించారు.
