
- రాష్ట్రాన్ని ఇన్నొవేషన్ హబ్గా మారుస్తాం
- ఓఆర్ఆర్, ఆర్ఆర్ఆర్ కేంద్రంగా ప్రత్యేక జోన్లు
- ఏడాదిన్నరలో రూ.3లక్షల కోట్ల పెట్టుబడులు తీసుకొచ్చాం
- ఐఐటీఈఎక్స్ ముగింపు వేడుకలకు హాజరు
హైదరాబాద్, వెలుగు: మేకిన్ ఇండియా కాదు.. ఇన్వెంట్ ఇన్ తెలంగాణ అన్నదే సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రజా ప్రభుత్వ నినాదం, లక్ష్యమని ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. ఆ దిశగా అడుగులు వేస్తున్నామని, తెలంగాణను ఇన్నొవేషన్ హబ్ గా మార్చేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ఆదివారం హైటెక్స్ లో ‘ది ఫెడరేషన్ ఆఫ్ తెలంగాణ చాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ (ఎఫ్ టీసీసీఐ)’ ఆధ్వర్యంలో నిర్వహించిన ‘ఇండస్ట్రియల్ ఇన్నొవేషన్ అండ్ టెక్నాలజీ ఎక్స్పో (ఐఐటీ ఈఎక్స్)–2025’ ముగింపు వేడుకల్లో ఆయన మాట్లాడారు.
ఈ ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో తెలంగాణ ఇండెక్స్ ఆఫ్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ (ఐఐపీ) కంపౌండ్ మంత్లీ గ్రోత్ రేటు (సీఎంజీఆర్) 2.9 శాతంగా ఉంటే.. జాతీయ సగటు 0.52 శాతమేనన్నారు. తెలంగాణలో 6 రెట్లు అధికంగా నమోదైందని తెలిపారు. 2024–25లో ఇండస్ట్రియల్ గ్రాస్ స్టేట్ వాల్యూ యాడెడ్ (జీఎస్ వీఏ) రూ.2.77 లక్షలకు చేరిందని, ఇంధన వినియోగంలో 15.6 శాతం, జీఎస్టీ వసూళ్లలో 9.8 శాతం, పే రోల్ ఎన్ రోల్ మెంట్స్ లో 13.9 శాతం వృద్ధి రేటు రికార్డయిందని ఆయన తెలిపారు.
భవిష్యత్ తరాల కోసమే..
కాంగ్రెస్ ప్రభుత్వం రాబోయే తరాల కోసం ఆలోచించి ప్రణాళికలు రూపొందిస్తున్నదని మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. ‘‘రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను 2035 నాటికి ట్రిలియన్ డాలర్లకు, 2047 నాటికి 3 ట్రిలియన్ డాలర్లకు చేర్చాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. ఆ దిశగానే అడుగులు వేస్తున్నాం. తెలంగాణ రైజింగ్ 2047 లక్ష్య సాధనలో భాగస్వామ్యమయ్యేందుకు ముందుకొచ్చిన టోనీ బ్లెయిర్ ఇన్స్టిట్యూట్కు ధన్యవాదాలు. రాష్ట్రాభివృద్ధిలో కలిసొచ్చే వారందర్నీ కలుపుకుని ముందుకెళ్తాం. దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముకగా నిలిచే సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమ (ఎంఎస్ఎంఈ)ల బలోపేతంపై మా ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి సారించింది.
18 నెలల్లో కొత్తగా 15 వేల ఎంఎస్ఎంఈలు ప్రారంభమయ్యాయి. మన జీఎస్ డీపీలో ఎంఎస్ ఎంఈల వాటాను 10 శాతానికి పెంచాలనే సంకల్పంతో గతేడాది ప్రత్యేక పాలసీకి రూపకల్పన చేశాం. ప్రతి జిల్లా కేంద్రాల్లోనూ ప్రత్యేకంగా ఎంఎస్ ఎంఈ పార్కులను అభివృద్ధి చేస్తున్నాం. వీటిల్లో మహిళలు, ఎస్సీ, ఎస్టీ పారిశ్రామికవేత్తలకు ప్రాధాన్యం ఇస్తాం’’ అని చెప్పారు. కార్యక్రమంలో ఎఫ్ టీసీసీఐ అధ్యక్షుడు సురేశ్ కుమార్ సింఘాల్, సీనియర్ ఉపాధ్యక్షుడు ఆర్.రవి కుమార్, ఉపాధ్యక్షుడు కేకే మహేశ్వరి, ఐఐటీఈఎక్స్ 2025 కన్వీనర్ విమలేశ్ గుప్తా పాల్గొన్నారు.
లైఫ్ సైన్సెస్ రంగంలో రూ.40వేల కోట్లు పెట్టుబడులు
రాష్ట్రం నుంచి పరిశ్రమలు తరలిపోతున్నాయంటూ కొందరూ విష ప్రచారం చేస్తున్నారని మంత్రి శ్రీధర్ బాబు మండిపడ్డారు. కానీ.. ఏడాదిన్నరలోనే రూ.3 లక్షల కోట్లకు పైగా పెట్టుబడులను తెలంగాణకు తీసుకొచ్చామని గుర్తు చేశారు. ఒక్క లైఫ్ సైన్సెస్ రంగంలోనే రూ.40 వేల కోట్ల పెట్టుబడులొచ్చాయని చెప్పారు. ‘‘కొత్తగా 150 కొత్త ప్రాజెక్టులు మొదలయ్యాయి. 51 వేల మంది ప్రత్యక్షంగా, మరో లక్షన్నర మంది పరోక్షంగా ఉపాధి పొందుతున్నారు.
అంతర్జాతీయ ప్రమాణాలతో ఫ్యూచర్ సిటీ, ఏఐ సిటీ, లైఫ్సైన్సెస్ సిటీ, గ్రీన్ ఇండస్ట్రియల్ కారిడార్లను అభివృద్ధి చేస్తున్నాం. పారిశ్రామికాభివృద్ధి వికేంద్రీకరణకు ప్రత్యేక ప్రణాళికలు రూపొందించాం. ఔటర్ రింగ్ రోడ్డు లోపల టెక్నాలజీ, సర్వీసెస్ జోన్, ఓఆర్ఆర్, ఆర్ఆర్ఆర్ మధ్య మాన్యుఫ్యాక్చరింగ్ జోన్, ఆర్ఆర్ఆర్ బయట వ్యవసాయ, గ్రామీణ ఇన్నొవేషన్ జోన్ ను ఏర్పాటు చేసేందుకు కసరత్తు చేస్తున్నాం’’అని శ్రీధర్ బాబు తెలిపారు.